కరోనాతో మరో ఎంపీ కన్నుమూత

కరోనా వైరస్ కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. నిన్న కరోనా కారణంగా ఏపీలోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూయగా.. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ(55) కరోనా బారిన పడి మృతి చెందారు. ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ నెల 2న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

 

కర్ణాటక రాయచూర్‌కు చెందిన అశోక్‌ గస్తీ విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్ లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక నుంచి రాజ్యసభకు అశోక్‌ గస్తీ తొలిసారి ఎన్నికయ్యారు. జులై 22న ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, రాజ్యసభకు ఎన్నికైన మూడు నెలలలోపే, ఒక్కసారి కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే ఆయన కన్నుమూశారు.