జగన్ సర్కార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది: బీజేపీ

 

ఏపీలో కొత్తగా కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ఈ ప్రభుత్వమూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా కనుక ఇవ్వాలనుకుంటే ముందుగా ఏపీకే ఇవ్వాలని కేందాన్ని కోరతామని అన్నారు. ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలు రావడానికి ఎటువంటి సంబంధం లేదని మాధవ్ చెప్పారు. 

ఈ సందర్భంగా తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ ప్రాజెక్టుపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. తమ అనుమానాలు తీర్చిన తర్వాతే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ వెళ్లాలని డిమాండ్ చేశారు. నికరజలాలు లేకుండా నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై జగన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాధవ్ అన్నారు.