విజయసాయి రెడ్డిపై విరుచుకు పడిన బీజేపీ నేతలు
posted on Jul 9, 2020 1:27PM
వైసీపి ఎంపీ విజయ సాయి రెడ్డి సాధారణంగా చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ ఘాటైన ట్వీట్ పెట్టడం దానికి టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం కామన్. ఐతే తాజాగా అయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా పై ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ల పై బీజేపీ నేతలందరూ మూకుమ్మడిగా దాడి చేసారు.
ఇంతకూ విజయ్ సాయి రెడ్డి కామెంట్స్ ఏంటంటే "ఏపీలో బిజెపి లేకుండా చేయాలన్న కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని మిమ్మల్ని నేను అలెర్ట్ చేయడం తప్పా? " అని ఏపీ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను అయన ప్రశ్నించారు. అంతే కాకుండా "అన్ని పార్టీల వ్యవహారాల్లో తలదూర్చే కన్నా తమపార్టీ గురించి మాత్రం అలెర్ట్ చేసినా పట్టించుకోవడం లేదని కొంపదీసి ఆయన కూడా పసుపు మిడతల దండులో భాగస్వామేనా?. నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. కానీ బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా మాత్రం సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి విజనరీ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది'' అని విజయసాయి తన తాజా ట్వీట్ లో కన్నాను నిలదీశారు.
ఐతే దీని పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. విజయసాయి ట్వీట్ పై ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ తో పాటు నేతలంతా మూకుమ్మడిగా ఎంపీ విజయ్ సాయి రెడ్డి పై దాడి చేసారు. "రాజకీయ నాయకులు మీ పార్టీలో చేరితే ఆరిందాలు, మిగతా పార్టీలో చేరితే మిడతలా…? అయినా గురివింద గింజ తన నలుపెరగదు " అంటూ బీజేపీ నేత సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. "కేవలం పసుపు రంగు మాత్రమే కాదు అన్ని రంగులను కాషాయం చేయగల సత్తా బీజేపీకి ఉంది. ముందు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్ల మాసిపోతున్నమీ పార్టీ రంగు సంగతి చూసుకోండంటూ" అంటూ ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్, ఎంపీ విజయ్ సాయి రెడ్డి కి రిప్లై ఇచ్చారు. మరో పక్క "మీరు బీజేపీ విషయాలు పట్టించుకోవటం మాని మీ సొంత పార్టీ వ్యవహరాలు చేసుకోవాలని" బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ విజయసాయి రెడ్డి కి చురకలంటించారు.
ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎపి బీజేపీ లో నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఇప్పటి వరకు ఉండేది. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వాన్ని ఇలా విమర్శించగానే అటు ఢిల్లీ నుండి జివిఎల్ నరసింహారావు వైసిపి ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడే వారు. దాంతో కన్నా సైలెంట్ అయిపోవడం కామన్. ఇక సోము వీర్రాజు గారు సరే సరి. ఆయన ఇప్పటికి ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ పైన దాడి చేస్తూ వైసిపి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తారు. ఐతే పార్టీలో ఎం జరిగిందో ఏమో కానీ తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ను టార్గెట్ చేస్తూ విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు అందరు మూకుమ్మడిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.