ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపాలనుకున్న బీజేపీ ఆశలు అడియాశలయ్యాయి. గత ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఈసారి ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి కూడా ఓటమి చవిచూడటంతో ఆ పార్టీకి తెలంగాణలో గట్టి దెబ్బ తగినట్లైంది. ముషీరాబాద్‌ నుంచి బరిలోకి దిగిన కె.లక్ష్మణ్‌‌.. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌ చేతిలో ఓడిపోయారు. అంబర్‌పేట నుంచి బరిలోకి దిగిన కిషన్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి నేతలు రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆ పార్టీకి కలిసిరాలేదు. కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. గోషామహల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విజయం సొంతం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి ముఖేశ్‌గౌడ్‌పై ఆయన విజయం సాధించారు.