బెంగాల్ పోలింగ్ లో హింస..  ఐదుగురి మృతి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ ఉద్రిక్తంగా మారింది. కూచ్‌బెహార్‌ జిల్లాలో తృణమూల్‌, బీజేపీ  కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  అంతకుముందు ఇదే ప్రాంతంలో ఓ యువ ఓటరు మృతిచెందారు.  కాల్పుల ఘటనతో కూచ్ బెహార్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో గల ఓ పోలింగ్‌ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్‌ బుర్మాన్‌ అనే ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. అయితే మృతుడు తమ పోలింగ్‌ ఏజెంట్‌ అని, అధికార పార్టీయే అతడిపై కాల్పులు జరిపిందని బీజేపీ కౌంటరిచ్చింది. 

యువకుడిపై కాల్పుల తర్వాత తృణమూల్‌,  బీజేపీమద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణకు దిగారు. బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేశాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది.ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది భారీగా మోహరించారు.  

హుగ్లీ ప్రాంతంలో భాజపా అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీ కారుపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై, వాహనాలపైనా దాడి చేశారు. ఈ ఘటనపై లాకెట్‌ ఛటర్జీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.