దాసరికి బండ్ల గణేష్ కౌంటర్

 

అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్య మూర్తి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ “ఇదివరకు ఏ.యన్.ఆర్. యన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమను దశాబ్దాలపాటు ఏలారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇరువురు మంచి నటులుగా పేరు సంపాదించుకొన్నారు. అందుకే వారిరువురికీ అసంఖ్యాకంగా అభిమానులున్నారు. కొత్తగా సినీ రంగంలో ప్రవేశిస్తున్నవారు, ఇప్పటికే సినిమాలలో నటిస్తున్న వారు కూడా వారిరువురిని అనుకరించే ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాము,”అని అన్నారు.

 

ఏ.యన్.ఆర్. యన్టీఆర్ ల తరువాత అంత ప్రజాధారణ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లుపొందుతున్నారన్నట్లు మాట్లాడిన దాసరి నారాయణ మాటలకి చిరంజీవి అభిమానులకు ఆగ్రహం కలగడం సహజం. ఆయన చిరంజీవి ప్రసక్తి తేకుండానే వారిని మాత్రమే పొగిడటం ద్వారా చిరంజీవిని తక్కువచేసి చూపారని భాధపడుతున్నారు.

 

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ విషయంలో బాధపడినట్లే ఉంది. అందుకే ఆయన కొన్ని ట్వీట్ మెసేజ్ లు పెట్టారు. ఇవి చదివితే చిరంజీవి అభిమానులు సంతోషించడానికి ఈ నాలుగు ముక్కలు సరిపోవూ? అని అనుకోకుండా ఉండలేము.

 

“రాముడు లేని రామాయణం చదవం. చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం. కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్టార్.”

 

“రామారావుగారు, నాగేశ్వరరావుగారు, కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెంబర్-వన్ అయ్యి మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన మెగాస్టార్ చిరంజీవి.”

 

“తెలుగువారి క్యాలెండర్లో పండగలు ఉంటే, తెలుగు సినీపరిశ్రమ కాలెండర్లో చిరంజీవిగారి సినిమా రిలీజ్ డేట్స్ ఉంటాయి.”

 

“చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటాం.”

 

“ బాక్స్ ఆఫీసుని పునర్నిర్వచించిన మెగాస్టార్ చిరంజీవి. సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నించి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా.”

 

“జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!!"