సీఎం కి నాన్‌బెయిలబుల్‌‌ వారెంట్‌

2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ  పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది.

 

ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది.తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది.

 

ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఉదయం నుంచే ఇలాంటి ఊహాగానాలు విన్పిస్తున్నప్పటికీ తాజాగా సీఎం చంద్రబాబుకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగు దేశం నేతలు తప్పు బడుతున్నారు. చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి.