కూతురికి ఆస్తి రాసిచ్చిందని..అత్త కాళ్లు నరికిన కోడలు..!

డబ్బు, ఆస్తి కోసం మనుషులు ఎంతకు తెగిస్తున్నారో రోజుకోక ఉదంతం తెలియజేస్తోంది. కళ్లకు డబ్బు పోరలు కమ్ముకుపోయి..రాక్షసులుగా మారి..బంధాలను కూడా మరచిపోయి ఎంత వికృతంగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి తాజా ఉదాహరణ చాలు. తమకు కాకుండా కూతురి పేరిట ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసిందన్న కోపంతో ఓ కోడలు అత్త కాళ్లు నరికేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్‌కు చెందిన ముచ్చెర్ల రాములు, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో చిన్న కుమార్తె సుజాత అంగవైకల్యంతో బాధపడుతోంది. కూతురికి ఆసరాగా ఉంటుందన్న ఆశతో తనకు ఉన్న రెండు ఇళ్లలో ఒక ఇంటిని మంగమ్మ ఇటీవల కుమార్తె సుజాత పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. విషయం తెలుసుకున్న కోడలు జయశ్రీ అత్తతో వాగ్వాదానికి దిగింది. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఇద్దరి మధ్య మరోసారి వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహం పట్టలేని జయశ్రీ అత్తను రోకలిబండతో మోదింది. అక్కడితో ఆగకుండా పదునైన ఆయుధం తీసుకొచ్చి మంగమ్మ రెండు కాళ్లు నరికేసింది. మంగమ్మ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి..ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయశ్రీ కోసం గాలిస్తున్నారు.