ఇంకా టైం పడుతుంది... నామమాత్రంగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు

సుదీర్ఘ విరామం తర్వాత పోలవరం ప్రాజెక్టు దగ్గర పనులు ప్రారంభమైయ్యాయి. స్పిల్ వే, స్పిల్ చానల్ లో నీరు నిలిచిపోవడంతో తోడేసిన తర్వాత పనులు మరింత ఊపందుకోనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కొంత పురోగతి మొదలైందనే చెప్పలి. మొత్తం మీద 6 నెలల తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు దగ్గర గత కొంత కాలం నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను పూర్తిగా నిలిపివేసింది. అంతేకా కుండా రీటెండరింగ్ విధానం ద్వారా కాంట్రాక్టును మార్చాలనే ప్రతిపాదన తలెత్తడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆ తర్వాత కాంట్రాక్టును మార్చారు. నవయుగ స్థానంలో కొత్త మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు.

పనులు అప్పగించిన తరువాత ఒక్కసారిగా గోదావరికి వరదలు రావడంతో మొత్తం పనులు ప్రారంభించటానికి ఎటువంటి ఆకాశం లేకుండా పోయింది.వరద అధిక స్థాయిలో రావడంతో స్పిల్ వే పై నుండి నీరు ప్రవహించింది. అందు కారణంగా పనులు అసలు ఏమాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. మరో పక్క ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర కూడా వరద నీరు చాలా వేగంగా వెళ్లడంతో ఆ కాపర్ డ్యామ్ కొట్టుకు పోతుందన్న భయం నెలకొంది. కానీ దాదాపు రెండు నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేది. కాని వరద నీరు తగ్గు ముఖం పట్టినప్పటికీ స్పిల్ వేలో మాత్రం నీరు అలానే ఉండి పోయాయి. స్పిల్ వే తో పాటు స్పిల్ చానల్ లో కూడా నీరు అలాగే నిలబడిపోయింది.ఈ పనులకు సంబంధించి జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సమీక్ష జరిపారు.

ఆ సమీక్షలో పనులు వేగంగా జరగటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద చూస్తే పోలవరం పనులు ప్రారంభమైనా పూర్తిస్థాయిలో సాగనట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదో రెండు మూడు యంత్రాలు పెట్టి మాత్రం పనులు నామమాత్రంగా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు అదే విధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు స్పష్టంగా చెప్తున్నారు.