కొత్త పథకం.. కొత్త కార్డు.. ఏపీలో జగన్ కొత్త తరహా పాలన

 

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పథకానికి కొత్త కార్డులు రాబోతున్నాయి. లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రవ్యాప్త సర్వే నిర్వహించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆ బాధ్యతలను వలంటీర్లు సచివాలయాలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు నెల రోజుల పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. 

స్పందన కార్యక్రమంపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్,పెన్షన్, ఆరోగ్య శ్రీ ఫీజు రీయంబర్స్మెంట్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టబోతున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంతో గ్రామ సచివాలయాలు వాలంటీర్లకు పూర్తి స్థాయిలో పని అప్పగించినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికి కొత్త కార్డుల జారీ చేయటం వల్ల ఏ పథకానికి ఏ కార్డు ఉపయోగపడుతుందో లబ్దిదారులకు తెలుస్తుందని.. అధికారులకు కూడా ఒక స్పష్టత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో వైయస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మ బడి, నాయి బ్రాహ్మణులకు నగదు, వైయస్సార్ కాపు నేస్తం తదితర పథకాల కు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామన్నారు. గ్రామ సచివాలయాలలో శాశ్వతంగా లబ్ధిదారుల పేర్లు వెల్లడించే బోర్డులు ఉండాలని సూచించారు. అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేయటానికే ఉన్నామన్నది కలెక్టర్ లు, ఎస్పీలు గుర్తుపెట్టుకోవాలి అని సీఎం అన్నారు. ప్రజా వినతుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమైందని..అందుకోసమే ప్రయత్నించాలని స్పష్టం చేశారు. స్పందనల్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత కోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పై ఆరు జిల్లాల లో శిక్షణ అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయని సీఎం చెప్పారు.ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మానస పుత్రిక గా జగన్ అభివర్ణించారు. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కృషి చేయాలని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం పైనే రాత్రి పగలు ఆలోచించాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు.. రెవెన్యూ అధికారులకు.. ఆదేశించారు.