రాజు గారి చెవిలో రోజా ముల్లు...
posted on Mar 25, 2017 11:13AM
ఏపీ అసెంబ్లీలో పంచ్ పరమేశ్వర్..విసుగెరుగని బీజేపీ ఎమ్మెల్యే,శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజుకు విసుగొచ్చేసింది. పవర్ ఫుల్ ..టైమింగ్ సెటైర్లతో సభను హుషారెత్తించే విష్ణుకుమార్ చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది(హెడ్ ఫోన్స్తో..). రాజుగారు అంతలా కాకపోయిన కొంత ఇరిటేటింగయ్యారు. అందుకు కారణం రాజుగారి వెనకాల రాణిగారి రన్నింగ్ కామెంటరీ. ఆ రాణి ఎవరో కాదు ఏడాది తరువాత అసెంబ్లీలో తాజా రోజాలా అడుగెట్టిన వైసీపీ ఎమ్మెల్యే రోజాసెల్వమణి. వైసీపీ గ్యాలరీలో కూర్చోవాల్సిన ఆవిడ.. రాజు గారి వెనుక వరుసలో కూర్చున్నారు.అగ్రిగోల్డ్ అంశంపై వాడీవేడీగా జరుగుతున్న చర్చకు తన వాదనను జోడించేందుకు విష్ణుకుమార్ రాజు లేచారు. అప్పటికే అచ్చెన్న జగన్ సారీ చెప్పాలంటూ తెగ డిమాండ్ సేసేస్తున్నారు. ఒట్టిసారీ కాదు జగన్ లెంపలేసుకోవాల్సిందేనని రంకెలేసేసారు. ఎగ్జాట్లీ ఈ టైమ్లో మర్యాద రామన్నలా నాలుగు ముక్కలు మాట్లాడేందుకు పంచ్ పరమేశ్వర్ బెంచ్లో నుంచి లేచారు.
మంత్రి ప్రత్తిపాటిపై చేసిన ఆరోపణలనైనా నిరూపించాలి.. జ్యూడిషీయల్ ఎంక్వరీకైనా ఒప్పుకోవాలంటే.. లేదంటే తప్పని సెప్పి సబ్జెక్ట్కు ఫుల్స్టాప్ పెట్టాలని పెద్ద తరహాలో చెప్తూ చెప్తూ వెనక్కి తిరిగారు. ఉండమ్మా.. అని గ్యాపిచ్చారు.. బొట్టు పెట్టేస్తారా ఏంటీ..అని అంత అటెన్షనయ్యారు. విష్ణుకుమార్ స్పీకరేపు సూసారు. తన ఎనక రోజా రన్నింగ్ కామెంట్రీ సేస్తుందని ఫిర్యాదు చేశారాయన. ఏడాది సస్పెండైనా పరివర్తన రాకపోవడం విచారకరమన్నారు. ఈ గ్యాప్లో మరో రెండు కామెంట్లు పడ్డాయి. బాగా మాట్లాడావ్ చాల్లే కూర్చో అని వాయిస్ అల్లరిలో కలిసిపోయింది.రాజు గారు మహా ఇదిగా ఫీలయ్యారు. అసలు ఆమె సీట్లో ఆమె కూసోక..ఈడకొచ్చి చెవి కొరికేస్తుందని మళ్లీ ఫీలయ్యారు. రాజుగారు అంతలా ఇదయిపోతుంటే బ్యాక్సీట్లో రోజా మహా ఇదిగా ఫిదా అయినట్టు కన్పించడం కొసమెరపు. మొత్తానికి ఏడాది తరువాత ఎంట్రీ ఇచ్చి రోజా.. రాజుగారి చెవిలో ఎట్టాంటి ముల్లు మాటలు విన్పించారో... ఆవిడకు ఆయనకే తెలియాలి. కర్ణభేరిని కాపాడాయనే కృతజ్ఞతో ఏమో కానీ రాజుగారు పదే పదే హెడ్ఫోన్స్ ప్రేమగా నిమిరినట్టు కన్పించారు.