తిరుమలలో అమిత్ షాకు చేదు అనుభవం..
posted on May 11, 2018 11:48AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుపతి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి వచ్చిన ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిన నేపథ్యంలో ఆ సెగ తగిలింది. ఆయనకు అడుగడుగునా చుక్కెదురైంది. ప్రజలతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఆయన రాకను నిరసిస్తూ నినాదాలు చేశారు. అమిత్ షా వస్తున్నారన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న తిరుపతి వాసులు, అలిపిరి వద్దకు చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఇదే వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మరచిపోయారని నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ నిరసన చేపట్టగా, కాలినడకన తిరుమలకు బయలుదేరిన పలువురు యాత్రికులు కూడా వారితో జతకలిశారు. ఇక అమిత్ షా కాన్వాయ్ వెళుతుంటే, రహదారి పక్కన ఉన్న భక్తులు హోదా కోసం నినాదాలు చేశారు.