లోకేష్ చాలా తెలివైన వాడే...కానీ అదే దెబ్బేసింది....మాజీ నేత విశ్లేషణ !

 

ఏపీ మాజీ సీఎం కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలివి తక్కువ వాడని, పప్పు అని అప్పటి ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ప్రాజెక్ట్ చేసింది. ఆయన మీద వందల కొద్దీ మార్ఫింగ్ పోస్ట్ లు చేసీ చేసీ ఆయనకు పప్పు అనే పేరు పెట్టేసింది. దానికి తోడు ఆయనకు తెలుగు సరిగా పలకక పోవడంతో జనం అదే నిజమని నమ్మారు. నిజానికి ఆయన తెలివైన వాడు, అది ఆయనతో రాజకీయం చేసిన వారికి మాత్రమే తెలుసు, అది వైసీపీ వారికయినా టీడీపీ వారికయినా కీలక నేతలుగా ఉన్నవారికి. ఈ విషయం చెబితే మీకు నవ్వు రావచ్చు కానీ అదే నిజం.

ఇదే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత బీజేపీ నేత అంబికా కృష్ణ. తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నారా లోకేశ్ కు ప్రజల్లో అంత ఆదరణ రాలేదని అందుకే మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఓడిపోవడం టీడీపీకి, లోకేశ్ కు అపప్రధేనని అభిప్రాయపడ్డారు. లోకేశ్ కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ అపాయింట్ మెంట్ కూడా పార్టీ నేతలకు దొరికేది కాదని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుతో అపాయింట్మెంట్ కావాలన్నా దొరికేది కానీ లోకేశ్ తో దొరికేది కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికినా లోకేష్ ది దొరకక కొంతమంది మంత్రులు కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారని చెప్పుకొచ్చారు. నాయకుడి వెనుక లక్షల మంది ఉంటారని, అది అర్థం చేసుకుని వాళ్లకు టైం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కానీ అది తెలియక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే లోకేష్ చేసిన బ్లండర్ అని అంబికా కృష్ణ చెప్పారు. 

నిజానికి లోకేశ్ చాలా తెలివైనవాడనీ, ఆలోచనాపరుడనీ, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని అంబికా కృష్ణ తెలిపారు. ‘ఓ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఓ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయం లోకేశ్ కు బాగా తెలుసనీ, అయితే ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతుందేమో? అని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఇది ఈయన అనుభవం వలన వచ్చిన అభిప్రాయం మాత్రమే కానీ ఈ విషయం చాలా మందికి అర్ధం అయ్యింది. లోకేష్ కి మైనస్ ఏదయినా ఉంది అంటే అది లోకేష్ వెనక ఉన్న టీమ్ మాత్రమే. కిలారు రాజేష్, పెద్ది రామారావు లాంటి వారిని ఆయన ఒక కోటరీగా ఏర్పరచుకుని ప్రజలు కాదు కదా నాయకులను కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. అదే ఆయన కొంప ముంచింది.