ఢిల్లీ క్యాంప్‌లో ఇరుక్కున్న 32 మంది ఏపి విద్యార్థులు!

ఇట‌లీ నుంచి వ‌చ్చి ఢిల్లీలో క్వారెంటైన్ పూర్తి చేసుకున్నా, త‌మ ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి ఏపి భ‌వ‌న్ అధికారులు ఇంకా ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ఏపి చెందిన 32 మంది విద్యార్థులు సందిగ్ధంలో ప‌డ్డారు. ఇట‌లీ నుంచి ఇండియా వ‌చ్చినా, ఢిల్లీ నుంచి స్వంత ఊర్ల‌కు వెళ్ల‌డానికి జాప్యం జ‌రుగుతోంద‌ని ఏపి విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
 
క్వారెంటైన్ పూర్తి కావ‌డంతో ఇట‌లీ నుంచి వ‌చ్చిన స్టూడెంట్స్ 
ఇటలీ నుండి వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 270 మంది భారతీయ విద్యార్థులను మార్చి 15 న ప్ర‌త్యేక విమానంలో న్యూఢిల్లీ తీసుకువ‌చ్చారు. 31.03.2020 వరకు న్యూ ఢిల్లీలోని ఐటిబిపి చావ్లా క్యాంప్, బిఎస్ఎఫ్ క్యాంప్‌లోని క్వారెంటైన్‌లో వుంచారు. విద్యార్థులందరూ తమ క్వారెంటైన్‌ పూర్తి చేశారు. 

అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత  అనుమతితో అంద‌రు విద్యార్థులు తమ త‌మ రాష్ట్రాలకు వెళ్తున్నారు. నేడు తెలంగాణ విద్యార్థులు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో బస్సులో బయలుదేరుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన 32 మంది విద్యార్థులు క్వారెంటైన్ శిబిరం నుండి బయలుదేరారు. వారు తమ స్వస్థలాలకు వెళ్ళ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు.