13మంది ఎమ్మెల్యేలుగా రెడీగా ఉన్నారు... జగన్ ఒక్క మాట చెబితే చాలు..!

మీ శాసనసభ్యత్వానికి ఢోకా లేదని జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే చాలు.... 13మంది టీడీపీ ఎమ్మెల్యేలు... తెలుగుదేశాన్ని వీడటానికి సిద్ధంగా ఉన్నారంటూ అసెంబ్లీ లాబీల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్న జగన్ షరతులతోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆగుతున్నారని, లేదంటే ఎప్పుడు టీడీపీ ఖాళీ అయ్యేదంటూ కోటంరెడ్డి బాంబు పేల్చారు. అయితే, షరతులు పెట్టినా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తనతో 8మంది టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు.

అయితే, ఇప్పటికే టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటికి రాగా, తనతోపాటు మిగిలిన 22మందితోనే చంద్రబాబు... అసెంబ్లీలో అధికారపక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 67మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా జగన్ చేయలేనిది... కేవలం 22మంది ఎమ్మెల్యేలతో అధికార పక్షానికి బాబు చుక్కలు చూపిస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏంటో చూపిస్తున్నారు. 40ఏళ్ల తన రాజకీయ అనుభవంతో జగన్ అండ్ టీమ్ ను ధీటుగా ఎదుర్కొంటున్నారు.

ఒక్కరిని కాదు షేర్ ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించు అన్న సినీ డైలాగ్ మాదిరిగా జగన్ టీమ్ పై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. యాభై మంది కాదు... నూట యాభైమంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొనే దమ్ము... సమాధానం చెప్పే సామర్ధ్యం తనకుందంటూ వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గమనిస్తే... 151మంది వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఒక్కరే ధీటుగా సమాధానం చెబుతుండటం చూస్తుంటే... వన్ మేన్ ఆర్మీలా కనిపిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నారు.