కావూరి,లగడపాటి పై విజయమ్మ అరోపణలు
posted on Sep 20, 2013 2:46PM
రాష్ట్ర విభజనకే ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్రంలో మంత్రి పదవిని...విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు కొన్ని కాంట్రాక్టు పనులు ఇచ్చారని తమకు తెలిసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. విభజన విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించని విజయమ్మ ఇప్పుడు లగడపాటి, కావూరిల మీద ఆరోపణలు చేయడం ఆసక్తిగా ఉంది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తే కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీలలో ఎలాంటి చలనమూ లేదని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ మూలంగానే తెలంగాణ ఇచ్చారని విజయమ్మ అన్నారు. కాంగ్రెస్ నేతలు అధిష్టానం ముందు ఒకమాట – బయట ఒకమాట చెబుతున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా జైలులో ఉన్న జగన్ తో పాటు తాను, తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామాలు చేశారని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు అంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే శాసనసభ సమావేశం పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విజయమ్మ డిమాండ్ చేశారు.