జగన్ తెలివే తెలివి!

 

 

 

రాష్ట్రాన్ని అడ్డంగా ముంచేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పోతూపోతూ తనకంటే వెయ్యిరెట్లు ఎక్కువ తెలివితేటలున్న జగన్ని ఈ రాష్ట్రానికి కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. తెలివితేటల్లో ఆయనే ముదురనుకుంటే ఆయనగాని తనయుడు జగన్ మహాముదురు... ఇంకా చెప్పాలంటే దేశముదురు! వివిధ సందర్భాలలో జగన్ ప్రదర్శిస్తున్న తెలివితేటలు చూస్తుంటే కాకలు తిరిగిన రాజకీయ పరిశీలకులకే నోటమాట రావడం లేదు. ఏదైనా ఇష్యూని తనకు అనుకూలంగా టర్న్ చేసుకోవడంలో జగన్ తెలివే తెలివని నోళ్ళు పెగల్చుకుని మరీ అంటున్నారు.

 

ఇప్పుడు కృష్ణానది మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలుగోడు భవిష్యత్తులో నీళ్ళో రామచంద్రా అని అల్లాడే పరిస్థితులు వచ్చే ప్రమాదం వుంది. రాష్ట్రమంతా ఈ బాధలో వుంటే, జగన్ మాత్రం ఈ ఇష్యూలో కొత్తకోణం ఆలోచించాడు. ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని తేల్చిపారేశాడు. ‘‘మిగులు జలాల మీద మేము హక్కు కోరం’’ అని దివంగత రాజశేఖరరెడ్డి ట్రిబ్యునల్‌కి లేఖ రాసిన పాపమే ఇప్పుడు తెలుగు ప్రజల పాలిట శాపంగా మారిందని అందరూ దివంగతుడైన పెద్దమనిషిని విమర్శిస్తున్నారు.  ఈ సమయంలో నేరం తన తండ్రి మీదకు రాకుండా వుండటానికి జగన్ భలే పథకం వేశాడు.



ఈ ఇష్యూలో చంద్రబాబునే దోషిగా నిలబెట్టే ప్లాన్ వేశాడు. దాంతో చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని వెరైటీ పాట పాడటం మొదలుపెట్టాడు. లేఖ రాసి తప్పు చేసిన తన ‘బాబు’ మీద వున్న ఫోకస్‌ని తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్ర‘బాబు’ మీదకు మళ్ళేలా స్కీమ్ సెట్ చేశాడు. ఈ స్కీమ్‌ని మరింత మోయడానికి జగన్ మానసపుత్రికలు పేపరు, ఛానలూ ఎలాగూ ఉండనే వున్నాయి. దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా వుంటుందో ఇదికూడా అలాగే వుంది.