ఎస్సీ,ఎస్టీ చట్టసవరణపై స్టేకు సుప్రీం నో

 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసులో నిందితుడికి బెయిల్‌ లభించకుండా కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారని.. అందువల్ల ఈ చట్టం కింద కేసు నమోదు చేయగానే వెంటనే అరెస్టులు చేయకూడదని, పోలీసులు విచారించాలని, ముందస్తు బెయిలు కూడా ఇవ్వాలని గత ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథావిధిగా ఉంచుతూ కేంద్రం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ 2018 ప్రకారం నిందితుడికి ముందస్తు బెయిలు ఇవ్వరు.

ఈ చట్టానికి సంబంధించి గత ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను, సవరణలను సవాలు చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను కలిపి ఒకేసారి విచారణ చేపడతామని జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని న్యాయస్థానం వెల్లడించింది. అలాగే ధర్మాసనం ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకు పంపింది. ఈ పిటిషన్లపై విచారణకు జస్టిస్‌ లలిత్‌ను చేర్చి తిరిగి ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ భాగమైనందున ఆయన్ను ఈ ధర్మాసనంలో చేర్చాలని కోరింది.