ఐపీఎల్ 6 ఫిక్సింగ్ : చెన్నై సీఈవో గురునాథ్ అరెస్ట్
posted on May 25, 2013 11:30AM
భారత క్రికెట్ సంఘం సారథి ఎన్.శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో గురునాథ్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గురునాథ్ మేయప్పన్ మదురై నుంచి ముంబై రాగానే... దాదాపు మూడు గంటలు ప్రశ్నించి... అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విందూ దారాసింగ్తో బంధంపై పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. గురునాథ్ బాలీవుడ్ నటుడు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన విందూ దారాసింగ్తో సన్నిహిత సంబంధాలు నడిపారు. విందూ ద్వారా గురునాథ్ భారీగా బెట్టింగ్లకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. గురునాథ్ ఒక జట్టు యజమానికి అల్లుడై ఉండి, ఆ జట్టు సీఈవోగా వ్యవహరిస్తూ బెట్టింగ్లకు పాల్పడటం గమనార్హం. శుక్రవారం తమ ముందు హాజరు కావాల్సిందిగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురునాథ్కు గురువారం సమన్లు జారీ చేశారు. ఆయన సోమవారం వరకు గడువు కోరినప్పటికీ... పోలీసులు అంగీకరించలేదు.