రాష్ట్ర విభజనపై సీమాంద్ర నేతల అల్టిమేటం
posted on Jul 30, 2013 11:43AM
రాష్ట్ర విభజన విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని సీమాంధ్ర నేతలు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు జరిగితే పార్లమెంటులో తేల్చుకుంటామని అన్నట్లుగా తెలుస్తోంది. సీమాంద్ర నేతలు ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ను కలిశారు.
రాష్ట్ర విభజన కూడదని, అదే జరిగితే దేనికైనా సిద్ధమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. తమ మౌనం మరోరకంగా ఊహిస్తే తగిన ఫలితం ఉంటుందని చెప్పారు. ఆహార బిల్లుకు మద్దతిచ్చే అంశంపై పునరాలోచించాల్సి ఉంటుందని ఘాటుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోమని తాము చెప్పమని కానీ, శాస్త్రబద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎస్సార్సీ ద్వారా విభజించాలని కోరారు.
రాష్ట్ర విభజన పై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏమైనట్లని ప్రశ్నించారు. వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.