రేవంత్ రెడ్డి మనసులో ఏముంది...?

 

రేవంత్ రెడ్డి పార్టీ మార్పు నిజమేనా..? కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? కాంగ్రెస్ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారా..? అసలు రేవంత్ రెడ్డి మనసులో ఏముంది...? టీటీడీపీలో అసలేం జరుగుతుంది...? ప్రస్తుతం అందరి మనసులో రేగుతున్న ప్రశ్నలు ఇవి. కాని ఇప్పుడప్పుడే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం లేదనుకోండి. ఎందుకంటే ఒకపక్క రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించి.... తాను పార్టీ మారేది లేదని చెబుతున్నా.. మరోపక్క రేవంత్ రెడ్డి కదలికలు చూస్తే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందంటున్నారు రాజకీయ వర్గాలు. దానికి కారణం... ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ ఆయ్యారన్న వార్తలు రావడమే. ఇప్పటికే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై  చర్చించేందుకు టీడీపీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు... ఆయన ఉదయం 10 గంటలకే ఇంటి నుండి బయలుదేరారు. అయితే ఆయన మార్గమధ్యలో గోల్కొండ హోటల్లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశానికి ఆయన హాజరయ్యారని, ఆ తరువాతే ఎన్టీఆర్ భవన్ బయ ల్దేరారని తెలుస్తోంది. అంతేకాదు తనతో వచ్చే 25 మంది సభ్యుల పేర్లను రేవంత్ .. తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు కుంతియా కు పంపినట్టు సమాచారం. దీంతో టీటీడీపీ పోలిట్ బ్యూరో భేటీకి ఆయన హాజరు కావడం, మరో వైపు కాంగ్రెస్ నేతలతో సమావేశమైనట్టు వస్తున్న వార్తలవల్ల అసలు రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలియక అందరూ జుట్టు పీక్కుంటున్నారు. మరి ఏముందో రేవంత్ రెడ్డికే తెలియాలి...