ధర్మాన, సబితా రాజీనామాలు ఆమోదం
posted on May 26, 2013 3:08PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంలంధించి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిలు చేసిన రాజీనామాలపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. వారి రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఆదివారం ఆమోదించారు. ఈ ఇద్దరి మంత్రుల పేర్లను సీబీఐ చార్జీ షీటులో పేర్కొనడంతో వారు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
సబిత, ధర్మానలు గతంలోనే రాజీనామా చేశారు. అయితే, వారు ఏ తప్పు చేయాలేదని చెబుతూ ముఖ్యమంత్రి వాటిని పక్కన పెట్టారు. కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులచే అధిష్టానం రాజీనామా చేయిస్తుండగా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటంపై సొంత పార్టీ నేతల నుండి విమర్శలు వచ్చాయి. మరోవైపు అధిష్టానం కూడా కిరణ్, బొత్సలను పిలిచి రాజీనామా చేయించాలని, వాటిని ఆమోదించేలా చూడాలని ఆదేశించింది. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకే సబిత, ధర్మాన రాజీనామాలను ఇప్పటికిప్పుడు గవర్నర్ వద్దకు పంపడం, వాటిని నరసింహన్ వెంటనే ఆమోదించడం జరిగిందని అంటున్నారు.