Next Page 
చదువు  పేజి 1

            

                                    చదువు
   
                                                                       ---- కొడవటిగంటి కుటుంబరావు


                                                                           

                                                                 
   

                                                                       ౧

     మధ్యాన్నం ఒంటిగంటనుంచి దాదాపు నాలుగు గంటల దాకా సీతమ్మకు విశ్రాంతి. నలుగురు అమ్మలక్కలుచేరి లోకాభి రామాయణం మాట్లాడటానికి అదే సమయం. ఈ లోకాభి రామాయణం అందరాడవాళ్ళకూ అవసరమే గాని కొందరు దీనికోసం ఇతరుల దగ్గరకి వెళ్ళనవసరం లేకుండా సీతమ్మలాగా తమదగ్గిరికే ఇతరులను రప్పించుకోగలరు. మరి కొందరు అమాయికస్రీలు సుబ్బమ్మలాగా రోజూ ఎవరో ఒకరి ఇంట అటెండన్సు వేయించుకోవలసిందే.
   
    సుబ్బమ్మంటే సీతమ్మ గారింట్లో పడమటి భాగంలో కాపురం ఉంటున్న లావుపాటి, నల్లటి ఆవిడ. ఇంకెవ్వరూ రాక పోయినా సుబ్బమ్మమటుకు రెండుగంటలలోపలే హాజరయేది. పూర్తిగా రెండు గంటలసేపు లోకాభిరామాయణం నడిచేది.
   
    ఆడవాళ్ళ ముచ్చట్లను మగవాళ్ళెన్నటికీ, పూర్తిగా అర్ధం చేసుకోలేరు. నూటికీ, కోటికీ, గాని ఇల్లు దాటిపోని సీతమ్మాలూ, సుబ్బమ్మాలూ, మాచమ్మాలూ, కూచమ్మలూ రోజూ అంతంతసేపు ఏం మాట్లాడుకుంటారు? ఎంతో అప్యాయతగల స్నేహితాలన్నా ఉంటే పోనీ అనుకోవచ్చు. కాని ఈ ఆడవాళ్ళలో అవీ కనిపించవు. వాళ్ళు పెద్ద స్నేహాలు చెయ్యకుండానే రోజూ ఒకరికొకరు అంతులేని విషయాలు చెప్పుకుంటారు.

    ఏమిటి విషయాలు? ఇవి తమకూ, తమ వారికీ సంబంధించినవి కావచ్చు. ఇతరులకు సంబంధించినవి కావచ్చు. ఈ ఆడవాళ్ళు ఇళ్ళు దాటకపోయినా పైవాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళు ఏవేవో వార్తలు తెస్తారు. ఎప్పుడైనా ఒక ఉత్తరం ఎక్కడినుంచైనా రావచ్చు. వీటిని గురించి ఎన్నాళ్ళయినా మాట్లాడుకోవచ్చు. కాలక్షేపానికి నిత్యామూ కొత్త విషయాలుండాలని కూడాలేదు. చెప్పుకున్న విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు.

    ఈ చెప్పుకోవడం ఆడవాళ్ళ జీవితాలకూ, వ్యక్తిత్వాలకూ ఎంతో ముఖ్యం. ఇది వాళ్ళ చదువు, వాళ్ళ సాహిత్యం వాళ్ళ తత్వజ్ఞానం, వాళ్ళ తపస్సు. నాలుగు రోజులపాటు ఆడవాళ్ళను కలవకుండా చేస్తే, తాము ఎటువంటి బానిసత్వంలో ఉన్నదీ, కూవస్థ మండూకాల్లాగా ఎట్లా జీవిస్తున్నదీ వాళ్ళకు తెలిసివస్తుంది.

                                                                   *    *    *    *
   
    పక్కభాగంలో ఉండే సుబ్బమ్మ ఇవాళ ఇంటోలేదు. ఎవరో బంధువులింటో పిల్లవాడికి అక్షరాభ్యాసమైతే వాళ్ళంతా భోజనానికి వెళ్ళారు.

    "సుబ్బమ్మగారూ, లక్ష్మివాళ్ళంతా ఎక్కడికమ్మా పోతున్నారూ?" అని పొద్దున సుందరం తల్లిని అడిగాడు.

    "వాళ్ళ బంధువు లబ్బాయి? నీవంటి వాడే ఉన్నాట్ట. వాణ్ణి బళ్ళో వేస్తున్నారట. అందుకని భోజనానికి పోతున్నారు." అన్నది సీతమ్మ.
   
    సుందరం ఉత్సాహంతో, "అమ్మా, నా అక్షరాభ్యాసానికికూడా అందరూ భోజనానికొస్తారా?" అన్నాడు.

    "ఎందుకు రార్రా? మనవాళ్ళంతా వస్తారు," అన్నది తల్లి.

    సుందరం కాసేపు ఆలోచించి, "అయితే, అమ్మా నా అక్షరాభ్యాసం ఎప్పుడూ?"అన్నాడు.

    ఈ ప్రశ్న వస్తుందని సీతమ్మకు తెలుసు. ఎందుకంటే ఆవిడ చాలా మాసాలనుంచీ సుందరానికి చదువుమీద అంతులేని ఆసక్తి కలిగిస్తుంది. తన ప్రయత్నం ఫలించి, సత్యం చదువంటే ఎప్పుడా, ఎప్పుడా అని తహతహ లాడటం కూడా ఆవిడ చూస్తున్నది. అయినప్పటికీ ఏ క్షణాన ఎవరు తన కొడుక్కు చదువంటే భయంకలిగేట్టూ, అసహ్యం పుట్టేటట్టూ చేస్తారో అని ఆవిడ గుండెలు పీచుపీచుమంటూనే ఉన్నాయి.

    ఎందుకంటే సీతమ్మ చూసినంతలో చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టటం చాతయినంత బాగా వాళ్ళకి చదువు మీద ఇష్టం కలిగించటం చాతకాదు. పిల్లలుచేసే అల్లరితో వేగలేక అనేకమంది తల్లులు,"వెధవా, బళ్ళోవేస్తేగాని నీ పొగరణగదు." అని పిల్లల్ని భయపెట్టడం ఆవిడ ఎరుగును. ఎంతోదూరం పోనవసరంలేదు. సీతమ్మ ఆడబడుచు కొడుకు బళ్ళోకి పోవటానికి కానీ, అర్ధణా లంచాలిస్తుంది.

    చదువు గురించి అగౌరవంగా మాట్లాడినా, పిల్లలకి చదువుమీద భయమో, అనుమానమో, అలక్ష్యమో కలిగించినా సీతమ్మ భరించలేక పోయేది. ఆవిడకి చాలా చిన్న తనంలోనే చదువుమీద ఎక్కడలేని అభిమానమూ కలిగించారు. ఆవిడకు తల్లి దండ్రులు చదువు చెప్పించలేదు. అస్సలు చదువుకునే పుస్తకాల సహాయంతో తానేచదవటమూ, రాయటమూ నేర్చుకున్నది. ఆవిడ బంధువులందరూ ఆవిడ నీవిషయంలో చాలా మెచ్చుకునేవారు.

    సీతమ్మ కాపురానికి వచ్చిన కాలంలో అత్తవారింట విశేషం పుస్తకాలుండేవికావు. ఆవిడ మామగారి తాలూకు భాగవతం ఉండేది. వీలు దొరికినప్పుడల్లా ఆవిడ ఆ భాగవతం తీసి చదువుతూఉండేది. అందులో అనేక మాటలకు అర్దాలు తెలియకపోయినా ఆవిడ నిరుత్సాహపడకుండా చదివేది. పుస్తకాలు చదవటంలో సీతమ్మకున్న ఆసక్తిని అత్తవారివేపువారు శ్లాఘించకపోగా ఎద్దేవకూడా చేసేవారు! కాని ఆ భాగవతంలోనే ప్రహ్లాద చరిత్రలో ఉన్న "చదువుని వాడఙ్ఞుండగు" అనే పద్యం సీతమ్మకు ఎంతో బలం చేకూరూస్తూఉండేది. ఒక్క సద్గుణ మైనా లేని హిరణ్య కశికుడికి చదువుమీద అంత గురి ఉన్నందుకు ఆవిడ ఆశ్చర్యపడేది.
   
                                                             *    *    *    *   
    'ఒక్కరోజు సుబ్బమ్మ లేకపోతే బొత్తిగా సందడిలేదు.' అనుకున్నది సీతమ్మ. కాస్సేపు కన్ను మూద్దామని ప్రయత్నించింది. కాని, పగటినిద్ర, అలవాటు లేని కారణంచేత పట్టలేదు. ఏంపని  కల్పించుకుందామా  అని ఆవిడ ఆలోచిస్తుండగా దొడ్లో కాలయాపన చేస్తున్న సుందరం పరుగెత్తుకుంటూ వచ్చి, "అమ్మా! అమ్మా! ఇంకో కొబ్బరిమట్ట పడింది. ఈనెలు తీద్దామా?" అన్నాడు.

    సుందరం, తల్లి కూరిమి పిల్లవాడు, సీతమ్మ కొడుకును ఎక్కువ గారాబం చెయ్యకుండానే వాడి అవసరాలను గురించి అందరికన్న ఎక్కువ శ్రద్ద కనబరచి వాడి అభిమానం సంపాదించింది. తల్లుల్ని ఆరాధించే ఇతర పిల్లలల్లేనే సుందరంకూడా తన తల్లి ఏం చేసినా అందంగా ఉన్నట్టూహించుకునేవాడు. ఆవిడ ఏపనిచేసినా వాడికి చూడబుద్ధి అయేది. ముఖ్యంగా తాపీగా కూర్చుని చేసేపనులంటే, వాడికి మరీయిష్టం. ఆవిడ కూరలు తరుగుతున్నా, లాంతర్లు తుడిచి నూనెపోస్తున్నా, దీపాలు వెలిగిస్తూన్నా, పొయ్యి దగ్గరకూర్చుని వంట చేస్తూన్నా ఏదో గొప్ప దృశ్యం చూచినట్టు చూసేవాడు సుందరం. ఆపనులన్నీ వాడికి కూడా చెయ్యాలని వుండేది, అటువంటి పనులలో తానుకూడా భాగం పంచుకోగలిగితే వాడి కంతకన్న ఏమీ అక్కర్లేదు. వాళ్ళమ్మ పుస్తకం చదువుతుంటే  చూసి ఆనందించటం వల్లనే వాడికి చదువంటే ఇష్టం ఏర్పడి ఉండవచ్చు.

 


Next Page 

WRITERS
PUBLICATIONS