వామనజయంతి ప్రత్యేకత!

 


ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారీ ఆ భగవంతుని తల్చుకోవడం నైజం. దైవకృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం. కానీ దేవుడు వస్తే కానీ తీరని బాధలు కలిగితే.... సాక్షాత్తు ఆ దైవమే కిందకి దిగిరాక తప్పదు. అలా ‘కిందకి దిగడం’ అన్న మాటను అవతరించడం అంటారు. అలా విష్ణుమూర్తి మానవాళిని రక్షించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తినట్లు చెబుతారు. వాటిలో ఐదవది వామనావతారం.

 

విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటి మానవ అవతారం వామనుడు. ఈ వామనుడి ప్రసక్తి రుగ్వేదంలోనే ఉందని చెబుతారు. ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది. ఒకప్పుడు బలి అనే రాక్షస రాజు ఉండేవాడట. ఆయన ఎవరో కాదు... సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే! బలి మంచివాడే, తన ప్రజలను కన్నబిడ్డలలా కొలుచుకునేవాడే. కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు. రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు.

 

స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను ఆదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు. బలిని అణచివేసే రోజు కోసం ఎదురుచూడసాగాడు.

 

మహాబలి ఒకసారి అశ్వమేథయాగాన్ని తలపెట్టాడని తెలిసింది. అతన్ని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి (వామనుడు) రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికి యాగంలో భాగంగా దానధర్మాలు సాగుతున్నాయి. అందరితో పాటుగా వామనుడు కూడా రాజు చెంతకి చేరాడు. అతనికి ‘ఏం కావాలో కోరుకోమంటూ’ బలి అడిగాడు. ‘నేను ఒంటికాయ శొంఠికొమ్ముని నాకు నగలూ నట్రా అవసరం లేదు. ఓ మూడు అడుగుల స్థలం చాలు,’ అని అడిగాడు వామనుడు.

 

వచ్చినవాడు సామాన్యుడు కాడని రాక్షసగురువు శుక్రాచార్యడు గ్రహించాడు. కానీ ‘ఆడిన మాట తప్పేది లేదంటూ’ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడిపోయాడు. ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానిమిస్తారు. దీన్నే మనం ధారాదత్తం అంటాము. ఆ ధారాదత్తాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలంలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ వచ్చినవాడు సామాన్యుడు కాడు కదా! ఒక పుల్ల తీసుకుని కమండంలోకి చొప్పించాడు. దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్తా పోయి ‘ఏకాక్షి’గా మారాడు.

 

ఇంతకీ ఆ వామనుడు అడిగిన మూడు అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే! తొలి అడుగు కింద భూమినీ, రెండో అడుగు కింద ఆకాశాన్నీ, మూడో అడుగు కింద బలి తలనీ కోరుకున్నాడు. బలి రాక్షసుడే కావచ్చు. కానీ తన ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకే ఓసారి తిరిగివచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఈయమని వామనుడికి అడిగాడు. ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్లుగా పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని నమ్ముతారు. తన ప్రజలు సుఖసంతోషంగా ఉండటాన్ని చూసి, తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట. ఆ సందర్భాన్నే ఓనం పండుగగా జరుపుకొంటారు.

 

మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్‌’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.

 

బలి గమ్యం లేని శక్తికి ప్రతీక, వామనుడు లక్ష్యం ఉన్న జ్ఞానానికి సూచన. వామనుడు కోరిన మూడు అడుగులకు కూడా చాలా అర్థాలే చెబుతారు. సత్వరజోతమోగుణాలనీ, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని అంటారు. ఇక తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే! వామన జయంతి సందర్భంగా ఆ విష్ణుమూర్తని కొలిచినవారు కూడా ఆ అహంకారాన్ని జయించి, ఈత బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories