భోగేశ్వరాలయము

(మట్టెవాడ)

కార్తీక మాసం వచ్చిందండీ.  శివారాధకులకు ఈ మాసమంతా పండుగే.  ప్రతి శివాలయంలోనూ ఉత్సవాలే.

 

అయితే, ఆధ్యాత్మికంగా, చారిత్రికంగా అద్భుతమైన సంపదగల మన దేశంలోని ఆలయాలెన్నో  చరిత్ర పుటలలో మరుగునపడుతున్నాయి.   ఒక్కసారి వాటిని పరిశీలిస్తే అద్భుత చారిత్రక గాధలెన్నో తెలుసుకోవచ్చు.   ఇలాంటి సంపదను జాగ్రత్తగా కాపాడి మన భావితరాలవారికి అందించవలసిన మనం  వీటిని విస్మరిస్తున్నాం.  అలాంటివాటిని దర్శించటానికి కూడా అశ్రధ్ధ చేస్తున్నాము.     అందుకే ఈ కార్తీక మాసంలో కొన్ని అపురూప శివాలయాలను పరిచయం చేస్తున్నాను.

ఆధ్యాత్మిక, చారిత్రిక నిలయాలైన అద్భుతమైన ఆలయాలు కాకతీయ సామ్రాజ్యంలో ఎన్నోవున్నాయి.  కాకతీయ సామ్రాజ్యం అనగానే ఓరుగల్లు…అదే ఇప్పటి వరంగల్…రామప్పగుడి, వెయ్యిస్తంబాల గుడి, భద్రకాళి ఆలయం....ఏదయివుంటుందా అని ఆలోచిస్తున్నారా?  అవేవీ కాదండీ.  వాటి గురించి అందరికీ తెలుసు.  అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక మరుగునపడుతున్న మాణిక్యంగురించి.  అదేమిటంటారా?


అదే భోగేశ్వర ఆలయం.  వరంగల్ రైలు స్టేషన్ కి దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల దూరంలో మట్టెవాడలో,  పోలీసు స్టేషన్కి పక్కనే వున్న సందులో వున్నది భోగేశ్వర  ఆలయం.  వరంగల్, చుట్టుపక్కలవారిలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించివుంటారు?  ఇంతకుముందు చూడకపోతే ఇప్పుడు చూడండి.  అయితే ఈ ఆలయం చాలా పెద్దదనో, శిల్ప సంపదతో అలరారుతోందనో అనుకోకండి.  మరి ఈ ఆలయం గొప్పదనాన్ని చెప్పేముందు ఈ ఆలయంవున్న ప్రాంతంగురించికూడా తెలుసుకుందాం.

 

కాకతీయులగురించి  జరిగిన పరిశోధనలలో తేలిన విషయం..   పూర్వం ఈ ప్రాంతం పేరు  మటియవాడ  అయి వుండవచ్చునని..  మటియ  అనే శబ్దానికి వ్యాపారమని అర్ధమట.  అలాగే ప్రస్తుతం హనుమకొండకి పూర్వనామం అనుమకొండట.  అనుమడు, కొండడు అనే ఇద్దరు ఎఱుకరాజులు ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి అనుమకొండ అనే పేరు వచ్చింది.  ఈ అనుమకొండలోనే  కాకతీయరాజులు కట్టించిన ప్రసిధ్ధచెందిన వెయ్యిస్తంభాలగుడి, భద్రకాళి, పద్మాక్షి అమ్మవార్ల దేవాలయాలు వున్నాయి.  ఆ కాలంలోనే ఈ అనుమకొండ ప్రసిధ్ధికెక్కినదనటానికి ఈ దేవాలయాలే నిదర్శనం.  చారిత్రాత్మకమైన ఓరుగల్లు – అనుమకొండల నడుమ ప్రజల సౌకర్యార్ధం  అభివృధ్ధిచెందిన వ్యాపార స్ధలం ఈ మటియవాడ.  కాలక్రమేణా మట్టెవాడ అయివుంటుంది.  అలాంటి వ్యాపారకేంద్రంలో వెలసిన ఆలయం ఈ భోగేశ్వరాలయం.


 

ఈ ఆలయానికి ఈ పేరు రావటానికి ఒక కధ చెబుతారు.  భోగి అంటే పాము.  ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికివచ్చి ఈశ్వరుని సేవించేదట.  భోగిచేత సేవించబడినవాడుకనుక భోగేశ్వరుడనే పేరు వచ్చిందంటారు. 

 

ఇలాంటి కధలు చాలాచోట్ల విని వుంటారు.  అయితే ఇక్కడి విశేమేమిటంటే స్వామి కొలువైన తీరు.   శివలింగం కింద లింగం – అలా 11 లింగాలు వున్నాయట.  ఇవి కనబడవు.   పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా వున్నది.  పానవట్టము క్రింది భాగము బోలుగా వుంటుంది.  ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వున్నదట.    శీచక్రం బిందు స్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం వున్నది.  అంటే అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రము, ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగము, శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము, ఆ పానవట్టముమీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి.  దానికింద పదకొండు శివ లింగాలు వున్నాయని,  అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు.  ఈ లింగాలలో మధ్యది సువర్ణలింగంట.


 

ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా, ఆ నీరు ఒక్కచుక్కయినా బయటకిరాదు.  ఎక్కడికి పోతున్నదో ఎవరికీ తెలియదు.  ఈ లింగానికి వెనుక భాగాన పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ప్రతిష్టించబడింది. 

ఈ దేవాలయం ప్రసిధ్ధిచెందకపోవటానికి వాస్తుదోషాలు కొన్ని వున్నాయని చెబుతారు.  స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు.  అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి.  అది శాస్త్ర సమ్మతం కాదంటారు.  నైఋతిలో బావి వుందన్నారుకానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారుట.  ఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో వున్నది.  ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే.

ఈ దేవాలయంలో క్షేత్రపాలకుడైన గణపతి విగ్రహం ఒకటి ఈ ప్రాంతంలోనే ఎక్కడో బోర్లపడివున్నదనీ, దానిని కనుక్కుని పునరుధ్ధరిస్తే ఈ దేవాలయం పూర్వ వైభవాన్ని పొందుతుందనీ శ్రీ శివానందమూర్తిగారి అభిప్రాయమట.

ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం  వుంటుంది.

ఇలాంటి దేవాలయాలని గౌరవించవలసిన అవసరం మనందరికీ వుంది.

పి.యస్.యమ్. లక్ష్మి


More Temples