పుత్రద ఏకాదశికి ఏం చేయాలి!

 

 

హిందూ కాలమానంలో ఒకో ఏకాదశికీ ఒకో పేరు ఉంది.  ఆ పేరు వెనుక ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా! పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్యపురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం- పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ఆయన రాజ్యంలోని వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికీ, ధాన్యానికీ ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాతైనా ఆయన కోరిక నెరవేరలేదు.

 

 

ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి ఉన్నడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే, తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమశుని వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే... రాజుగారికి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే... రాజుగారికి పుత్రసంతానం ప్రాప్తించింది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు.

 

 

పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఆ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా. ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. ఇక సంతానం ఒక లెక్కా!

ఈ శ్రావణశుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెబుతున్నారు. సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించినా, కుబేర మంత్రాన్ని జపించినా, కుబేర అష్టోత్తరాన్ని పఠించినా విశేషమైన ఫలితం దక్కుతుందట.

- నిర్జర.

 


More Enduku-Emiti