ఈ కేరళ వినాయకుడు పెరుగుతూనే ఉంటాడు

 


కాణిపాకంలో వినాయకుని గురించి తెలియని తెలుగువారు ఉండరు. అక్కడి గణపయ్య నానాటికీ పెరిగిపోతోందని చెబుతారు. కానీ కేరళలోనూ అలాంటి గణపతి ఆలయం ఒకటి ఉందన్న విషయం తెలుసా!

 

ప్రకృతి ఒడిలోకి చేరినట్లు కనిపించే కేరళ... ఆ కేరళ కొసన కసార్‌గాడ్ అనే పట్నం... ఆ పట్నానికి అతి సమీపంలో మధుర్‌ మహాగణపతి అనే ఆలయం. ఈ ఆలయం ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే! నిజానికి ఈ ఆలయంలోని మూలవిరాట్టు శివుడు. ఆ శివుని విగ్రహం కూడా ఓ స్వయంభువు అని చెబుతారు. అనగనగా మధుర అనే ఒక స్త్రీ ఈ శివలింగాన్ని కనుగొందట. ఆ శివలింగం చుట్టూనే ఈ ఆలయాన్ని నిర్మించారు. మధుర కనుగొన్నది కాబట్టి, ఈ ఆలయానికి ‘మధుర్ మహాగణపతి ఆలయం’ అన్న పేరు వచ్చింది.

 

ఒసారి ఆలయపూజారి పిల్లవాడు ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ... గర్భగుడిలోకి చేరుకున్నాడు. అక్కడ దక్షిణం వైపు ఉన్న గోడ మీద ఒక వినాయకుని రూపుని సరదాగా చెక్కాడు. పిల్లవాడి భక్తికే మెచ్చాడో, తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కానీ... ఆ బొమ్మ నుంచి ఓ వినాయకుని రూపు ఆవిర్భవించడం మొదలైంది. అంతేకాదు... అలా మొదలైని రూపు నానాటికీ పెరుగుతోందట కూడా! అందుకే ఆ వినాయకుని ‘బొడ్డ గణపతి’ అని పిలుస్తారట. అంటే బొజ్జ గణపయ్య అని అర్థం.

 

ఆ ఆలయం చరిత్రలో మరో విశేషం కూడా ఉంది. అదే టిప్పుసుల్తాను దాడి. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాడట. తిరుగుముఖంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందని చెబుతారు. అయితే తన సైనికుల తృప్తి కోసం నామకార్థంగా తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాను తన ఖడ్గంతో మోదిన గుర్తుని చూడవచ్చు.

 

మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనిపిస్తుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఇది ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని ‘గజప్రిస్త’ గోపురాలని అంటారు. ఆలయంలోని చెక్క మీద రామాయణ, మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు.

 

ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు..... ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తులు నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందుకనే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలను ప్రసాదంగా సమర్పిస్తే... ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి వేయి అప్పాలను నివేదించే ఆచారమూ ఇక్కడ కనిపిస్తుంది.

 

అవడానికి ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. కర్ణాటకలోని మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గోకర్ణం దగ్గర నుంచి సాగే ఆరు వినాయకుని క్షేత్రదర్శనంలో మధుర్ మహాగణపతి ఆలయాన్ని కూడా ఓ భాగమే!


-నిర్జర.

 


More Vinayaka Chaviti