కేదారేశ్వర్.. హజో...
హయగ్రీవ మాధవ మందిరానికి దగ్గరలోనే వున్నది కేదారేశ్వర్ మందిరం. మేము అక్కడికి చేరుకునేసరికి ఉదయం 10-15 అయింది. ఇక్కడ కూడా కాళ్ళకి పని చెప్పాలి. హయగ్రీవ మాధవ మందిరంకన్నా మెట్లు తక్కువే వున్నాయి. దాదాపో 80 మెట్లెక్కేస్తే చాలు .. మదనాచల అనే చిన్నికొండ మీద వున్న కేదారేశ్వర్ చేరవచ్చు. భారత దేశంలోని అతి ప్రాచీన దేవాలయాలలో ఇది ఒకటి. ఆలయంలో శిల్ప కళ అంతగా కనిపించదు.
అన్ని ఆలయాలు లాగానే ఈ ఆలయంకూడా మూడు భాగాలుగా వుంటుంది. ఇక్కడి స్వామి స్వయంభూ. అర్ధనారీశ్వర లింగం. శివ పార్వతులు ఒకే లింగంలో వున్నారు. శివ పార్వతులు ఒక చోట కలిసి వుండటంవల్ల లింగం మీద ఎప్పుడూ ఒక వెండి మూత పెట్టబడివుంటుంది. పూజారిగారు ఆ కవర్ తీసి అతి కొంచెంసేపు దర్శనం చేయించి మళ్ళీ కవర్ పెట్టేస్తారు.
ఇక్కడ శివుడికి వివిధ రకాల పుష్పాక్షతలతో పూజ జరుగుతుంది. ఒక్కొక్క విధమైన కోరిక నెరవేరటానికి ఒక్కొక్క రకం పూలతో పూజ చేయాలని చెబుతారు. అలా చేయటంవల్ల ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడకూడా ఐదు అఖండ దీపాలున్నాయి. ఇవి 6000 ఏళ్ళపైనుంచి వెలుగుతున్నాయంటారు. గర్భాలయంలో ఈ దీపాల వెలుతురు తప్ప వేరే వెలుతురు వుండదు.
ఉత్సవాలు :-
ఇక్కడ శివరాత్రికీ, చైత్ర మాసంలో మదన త్రయోదశికీ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. ఈ రెండు రోజులూ స్వామికి మహా నైవేద్యం రాత్రి పూజలయిన తర్వాతే పెడతారు. ఇంకొక విశేషమేమిటంటే, స్వామికి పెట్టే నైవేద్యంలో చేపలు, ప్రత్యేకంగా తయారు చేసిన గొఱ్ఱె మాంసం తప్పకుండా వుంటాయి. ఇవి ఇక్కడ విశేషాలు.
ఈ ఆలయాన్ని మొదట విశ్వకర్మ నిర్మించాడంటారు. భారత దేశంలో అనాదినుంచీ వున్న ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో వున్న ఫలకాలమీద వ్రాసిన సమాచారం ప్రకారం ఇది రాజేశ్వర సింఘ సమయంలో నిర్మించబడింది. అంటే మొదట నిర్మింపబడిన ఆలయం శిధిలమైన తర్వాత రాజేశ్వర సింఘ ఆలయ పునర్నిర్మాణంగావించాడు.
కేదార మందిరానికి కింద కమలేశ్వర్ మందిర్, జయదుర్గ మందిరాలున్నాయి. సమయాభావం వల్ల వీటిని చూడలేకపోయాము. చైత్ర శుక్ల అష్టమిని అశోకాష్టమి అంటారు. అశోకాష్టమి రోజు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయాలి. ఆ రోజు ఎనిమిది అశోక పూల మొగ్గలను తిని నీరు తాగి ఉపవాసం వుండాలి. ఇలా చేసినవారి జీవితంలో ఎప్పుడూ శోకం వుండదని ఇక్కడివారి నమ్మకం.
ఆ రోజు శ్రీ హయగ్రీవ మాధవుడు, కేదారేశ్వరుడు, కామేశ్వరులను పల్లకీలలో దండం, ఛత్రం, చామరం, వగైరా సకల మర్యాదలతో బ్రహ్మపుత్రలో స్నానానికి ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. ఈ ఉత్సవంలో దాదాపు 500 మంది స్వామివారి సేవకులు పాల్గొంటారు స్వామికి రకరకాల సేవలు చేయటానికి. ఊరేగింపు వెళ్తుంటే స్వామికి ముందు ఎవరూ గొడుగు వేసుకునిగానీ, టోపీ పెట్టుకునిగానీ వుండకూడదు. విశేషమేమిటంటే ఇలాంటి నియమాలను అమలు చేయటానికి ముస్లిం మతస్తులు కొందరు వెండి బంగారం తాపడం చేసిన కర్రలను తీసుకుని ముందు నడుస్తారు. హాజోలో సనాతనకాలంనుంచి వస్తున్న హిందూ, బౌధ్ధ, ముస్లిం మతస్తుల ఐకమత్యతకి చిహ్నం ఇది. ఇప్పటికీ వీరంతా సహృద్భావంతో కలిసి మెలిసి వుంటారు.
పావ మక్కా :-
హాజో హిందు, బౌధ్ధ, ముస్లిం మతస్ధులకు తీర్ధయాత్రాస్ధలం. హాజో ముస్లింలకు కూడా చాలా పవిత్ర స్ధలం. ఇక్కడ పావ మక్కా అనబడే మసీదు చాలా ప్రాముఖ్యతచెందినది. ఇది 1657 లో నిర్మింపబడింది. ఆ సమయంలో మొగలాయి చక్రవర్తి షాజహాన్ రాజ్యం చేస్తున్నాడు. ఈ మసీదు పునాదిలో మక్కానుంచి తెచ్చిన మట్టి వాడారు. అందుకే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. హజ్ యాత్ర చేసినందువల్ల వచ్చే పుణ్యంలో పావు వంతు ఈ మసీదు సందర్శనవల్ల వస్తుందని ముస్లింల నమ్మకం. అందుకనే దీనిని పావ్ మక్కా అంటారంటారు.
హాజో అనేక ఆలయాలకు నిలయమైనా, అందులో పంచ తీర్ధాలనబడే గణేష్, కేదార్, కమలేశ్వర్, కామేశ్వర్, హయగ్రీవ మాధవ మందిర దర్శనానికి ప్రాముఖ్యతవున్నా, సమయాభావం వల్ల హాజోలో మేము చూసినవి హయగ్రీవ మాధవ, కేదార మందిరాలే. వీటి గురించి బయల్దేరేముందు హైదరాబాద్ లో నాకు తెలిసిన సమాచారం గౌహతిలో కామాఖ్యా మందిరమేగాక రెండు కొండలు ఎదురెదురుగా వుంటాయిట, ఒకదానిమీద విష్ణ్వాలయం, ఇంకొకదానిమీద శివాలయం వుంటాయిట.
చాలా మహిమ కలవట. తప్పకుండా చూడండి అని మాత్రమే. ఆ సమాచారంతో ఇవ్వన్నీ కనుక్కున చూడటానికి చాలా ప్రయాస పడ్డాము. మీకా ప్రయాసంతా తప్పించాలనే ఇన్ని వివరాలు వ్రాస్తున్నాను. ఆ ప్రాంతాలకి వెళ్ళినవాళ్ళు తప్పకుండా ఈ ఆలయాల ప్రశాంతతని అనుభవించండి.
పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)