త్రిమూర్తులు నదులుగా ఎలా మారారు?

Karthika Puranam – 27

 

విష్ణు గణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు ''ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని విన్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో, తెలియచేయండి'' అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు.

జయ - విజయుల పూర్వజన్మలు

తృణబిందుడి కూతురు దేవహూతి. ఆమెయందు కర్దమ ప్రజాపతి దృక్ స్ఖలనం జరగడంవల్ల ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్లిద్దరూ విష్ణుభక్తిపరాయణులే. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడంవల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారం పొందారు. వేదవిదులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలిగి ప్రసిద్దులయ్యారు. అందువల్ల మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తనచేత యజ్ఞం చేయించవలసిందిగా సంకల్పం చేసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి, ఒకరు బ్రహ్మ, ఇంకొకరు యాచకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు. ఆ సొమ్ముతో అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తించదలచారు. తదర్ధంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇద్దరికీ తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి ''నువ్వు మొసలివైపొమ్మని'' శాపం పెట్టాడు. అంతటితో ఊరుకోక జయుడు ''అహంకారంతో శపించిన నువ్వు, సాహంకారి అయిన సామజమై పుడతావు'' అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇలా పరస్పర శాపగ్రస్తులైన ఆ సోదరులు ఇద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకుని తమ శాపాలను, తత్ పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై శ్రీహరినే ఆశ్రయించారు. ''హే భగవాన్! నీకు ఇంత మహా భక్తులమైన మేము మొసలిగా, ఏనుగుగా పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు'' అని మొర పెట్టుకున్నారు.

అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు ''జయ-విజయులారా! నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్థంభంనుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను. అందువల్ల మీరు సత్యం తప్పనివారై ''మీమీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి'' అని ఆదేశించాడు. తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ-విజయులిద్దరూ గండకీనది ప్రాంతాన మకర, మాతంగాలుగా జన్మించి పూర్వ జన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒక కార్తీకమాసం వచ్చింది. ఆ కార్తీకమాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగుగా ఉన్న జయుడు గండకీ నదికి వచ్చాడు. నీళ్ళలోకి దిగడమే తడవుగా ఆ నదిలో మొసలి రూపంలో ఉన్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్ధించాడు.

తలచిన వెంటనే ప్రత్యక్షమైన విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి, కరి, మకరాలు రెండిటినీ ఉద్ధరించి వారికి వైకుంఠం ప్రసాదించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీనదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నాయి.

ఓ ధర్మదత్తా! నువ్వు అడిగిన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువల్ల నువ్వు కూడా దంభమాత్సర్యాలను విడిచి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తులా, మకర, మేష సంక్రమణాలతో ప్రాతః స్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణలో నిష్ఠగా ఉండు. గోబ్రాహ్మణులను, విష్ణుభక్తులను సర్వదా సేవించు. కొర్రలు, పులికడుగునీరు, వంగ మొదలైన వాటిని వదిలిపెట్టు. జన్మ ప్రభ్రుతిగా నువ్వు అనుష్టిస్తున్నఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దన, తపో, యజ్ఞ తీర్ధాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో.

ఓ విప్రుడా! దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణ వల్ల నీవు, నీ పుణ్యంలో సగభాగం అనుకోవడం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకు వెళ్తున్నాం'' అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునః నియమవ్రత నిష్టుడిని చేసి కలహ సమేతంగా విమానంలో వైకుంఠానికి బయల్దేరారు.

''పృథురాజా! అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఎవరు వింటారో, వినిపిస్తారో వారు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులై, విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతారు..'' అంటూ నారదుడు చెప్పింది అంతా విని ఆశ్చర్యపోయిన పృథుచక్రవర్తి ''హే దేవర్షీ! ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులలాగానే గతంలో కృష్ణ, సరస్వతీ మొదలైన నదుల గురించి విన్నాను. ఆ మహా మహిమలన్నీ ఆ నదులకు చేనినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా.. విశదపరచు'' అని కోరగా తిరిగి నారదుడు చెప్పసాగాడు. ''కృష్ణానది సాక్షాత్తూ విష్ణుస్వరూపం. సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే.

కృష్ణా - సరస్వతీ నదుల ప్రాదుర్భావం

ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులూ కూడా కలిసి ఒక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురుపంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు.

దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భ్రుగుమహర్షి ''హే విష్ణుమూర్తీ! సరస్వతి ఎందుకు రాలేదో తెలీదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేమిటి గతి?'' అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ ''సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరొక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి'' అని సలహా ఇచ్చాడు.

ఆ సలహాను శివుడు కూడా సమర్ధించడంతో భ్రుగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణభాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఈవిధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తిచేయగానే సరస్వతి అక్కడికి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సరంచెంది ''ఎక్కడైతె పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు, భయము, మరణము - అనే మూడు విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన ణా స్థానంలో ఉపవిష్టురాలిన ఉవిద ప్రజలకు కనిపించనటువంటి రహస్యనదీ రూపం పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా! మీరందరూ ఈ యజ్ఞ వాటికలో ఉండి కూడా ణా సింహాసనాన నా కన్నా చిన్నదాన్ని ఆసీనురాలీని చేశారు. గనుక మీరు కూడా జడీభూత నదీరూపాలను పొందండి'' అని శపించింది.

సరస్వతీ క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారిస్తున్నా వినకుండా ''ఈ బ్రహ్మ నీకు ఎలా భర్తో, నాక్కూడా అలాగే భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు'' అని ప్రతిశాపం ఇచ్చింది.

ఈ లోపల హరిహరులు అక్కడికి వచ్చి ''మేం నదులం అయినట్లయితే లోకాలన్నీ అతలాకుతలం అయిపోతాయి. కనుక, అవివేకమైన నీ శాపాన్ని మళ్ళించుకో'' అన్నారు. కానీ ఆమె వినలేదు. ''యజ్ఞం మొదట్లో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడంవల్లనే నా కోప రూపంగా యాగం విఘ్నపడి ఆగమయింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే. నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాం'' అని చిప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ పరిణమించాయి.

ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పుముఖంగానూ, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించ ఆరంభించారు. గాయత్రీ, సరస్వతీ నదీ రూపాలు సావిత్రీ అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి.

ఈ యజ్ఞంలో ప్రతిష్టితులైన శివ, కేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, విన్నా, వినిపించినా వారి వంశమంతా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది.

Karthika Puranam in Karthika Masam, Karthika Puranam Chapter 27, Karthika Puranam describes Karthika Vratam, Devotees read or listen Karthika Puranam


More Festivals