కార్తీక మహా పురాణం ఇరవై ఒకటవ రోజు

శివుని కంటే ముందు కీర్తిముఖుని పూజించాలి

Karthika Puranam – 21

 

మారుమూలల్లో తల దాచుకున్నా వదలకుండా ముట్టదింప వస్తున్న జలంధరునికి భయపడిన దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు.

సర్వదేవతా కృత విష్ణుస్తోత్రం

నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ

సదాభక్త కార్యద్యతా యార్తి హంత్రే      

 విదాత్రాది స్వర్గస్థితి ధ్వంస కర్త్రే 

గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు

రమావల్లభా యా సురాణాం నిహంత్రే

భుజంగారి యానాయ పీతాంబరాయ  

మఖాది క్రియాపాక కర్త్రే వికర్త్రే  

శరణ్యాయ తస్మై నతాస్స్మోవతాస్మః  

నమో దైత్య సంతాపి తామర్త్య దుఃఖా    

చాలా ధ్వంసదంభోళయే విష్ణవేతే

భుజంగేళ తలే శయా నాయార్కచంద్ర

ద్వినేత్రాయ తస్మై నతాస్స్మో నతాస్మః

నారద ఉవాచ

సంకష్ట నాశనం స్తోత్ర మేతద్యస్తు పఠేన్నరః

సకదాచిన్న సంకష్టః పీడ్యతే కృపయా హారే

మత్స్య కూర్మాది అవతారాలు ధరించిన వాడివి, సదా భక్తుల కార్యములు నెరవేర్చేందుకు సంసిద్ధుడిగా ఉండేవాడివి, దుఃఖాలను నశింపచేసే వాడివి, బ్రహ్మాదులను సృష్టించి పెంచి, లయింపచేసేవాడివి, గద, శంఖం, పద్మం, కత్తి, ఆదిగా గల ఆయుధాలను ధరించిన వాడివి అయిన నీకు నమస్కారం.

లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడవాహనుడు, పట్టుబట్టలు, ధరించిన వాడివి, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వ రక్షకుడివి అయిన నీకు నమస్కారం.

రాక్షసులచేత పీడించబడిన దేవతల దుఃఖం అనే కొండను నశింపచేయడంలో వజ్రాయుధం వంటివాడివి, శేషశయనుడివి, సూర్యచంద్రులనే నేత్రాలుగా గలవాడివి అయిన ఓ విష్ణుమూర్తీ! నీకు నమస్కారం.

ఈవిధంగా దేవతలు రచించినది, సమస్త కష్టాలనూ సమయింపచేసేదీ అయిన ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో, వారి ఆపదలన్నీ శ్రీహరి తొలగిస్తాడు''అని పృథువుకు చెప్పి, నారదుడు పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు.

దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపంతో వెంటనే శయ్యపై నుండి లేచి, గరుడవాహనం అధిరోహించి, ''లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరునికి, దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్ను ఆశ్రయించారు. నేను వెళ్తున్నాను'' అన్నాడు.

అందుకా ఇందిరాదేవి రవంత చలించి, ''నాథా! నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది?'' అని ప్రశ్నించింది.

ఆ మాటకు మాధవుడు నవ్వి ''నిజమే దేవీ! నాకు నీమీది ప్రేమచేత, బ్రహ్మ నుండి అతను పొందిన వారాలచేత శివాంశ సంజాతుడు కావడంచేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడూ కాదు'' అని మాత్రం చెప్పి, సర్వాయుధ సమీక్రుతుడై, గరుడ వాహానారూఢుడై అతి వేగంగా యుద్ధభూమి చేరాడు.

మహాబలి అయిన గరుడుని రెక్కల విసురుకు పుట్టిన గాలివల్ల రాక్షససేన మేఘశకలాల వలె చెల్లాచెదురై నేల రాలిపోసాగింది. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో బాణాలేసి జలంధరుని జెండాని, రథచక్రాలని ధనుస్సుని చూర్ణం చేశాడు. తర్వాత అతని గుండెలపై ఒక మహా బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమిపై వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుని ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలధిశాయికి, జలంధరునికి బాహు యుద్ధం ఆరంభమైంది. ఆ ముష్టిఘాతాలకు, జానువుల తాకిడికి భూమి దద్దరిల్లసాగింది. భయావహమైన ఆ యుద్ధంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణణుడు ''నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది. ఏదైనా వరం కోరుకో'' అన్నాడు.

విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి ''బావా! రమారమణా! నువ్వు నాపట్ల నిజంగా ప్రసన్నుడవే అయితే, నా సోదరి లక్ష్మీదేవితోనూ, నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండు'' అని కోరాడు. తన మాట ప్రకారం విష్ణువు వెంటనే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు.

సమస్త దైవ స్థానాల్లోనూ రాక్షసులను ప్రతిష్టించాడు జలంధరుడు. దేవ, సిద్ధ, గంధర్వాదులు అందరి వద్దా ఉన్న రత్న సముదాయాన్ని అంతటినీ స్వాధీనపరచుకున్నాడు. వాళ్ళందర్నీ తన పట్టణంలో పడి ఉండేట్లుగా చేసుకుని, తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తీ! అలా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువు ఉంచుకుని, భూలోకమంతటినీ ఏకచ్చత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణుసేవానిమిత్తంగానే నేను(నారదుడు) ఒకసారి అతని ఇంటికి వెళ్ళాను.

పృథురాజా! అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో భక్తిప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం ''మునిరాజా! ఎక్కడినుంచి ఇలా వచ్చావు? ఏయే లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్తే, దాన్ని తప్పక నేరవేర్చుతాను'' అన్నాడు.

అప్పుడు నేను ఇలా అన్నాను.

''జలంధరా! యోజన పరిమాణము, పొడవు గలది, అనేకానేక కల్పవృక్షాలూ, కామధేనువులు గలది, చింతామణులతో ప్రకాశవంతమైంది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడిని అయిన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంపదలను చూసి నువ్వు గొప్పవాడివో, శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు గానీ ఒక్క స్త్రీ రత్నపు ఆధిక్యతవల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడిగా కనిపిస్తున్నాడు.

నీ ఇంట్లో అప్సరసలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరు అయినా ఉందురుగాక. వాళ్ళంతా ఏకమైనా సరే ఆ మహేశ్వరుని ప్రాణాంకస్థితమైన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగారు. కల్యాణానికి పూర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రమితుడై చేప వలె కొట్టుమిట్టాడాడో, అటువంటి ఆ పర్వత తనయకు ఇకయే చానా యీడు కాలేదు. నిత్యమూ ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ, ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరసా గణాన్ని సృష్టించాడో, ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వల్ల ఐశ్వర్యవంతులలో నువ్వు శివుని తర్వాతివానివేగానీ ప్రథముడివి మాత్రం కావు''

ఉపర్యుక్తవిధంగా జలంధరునితో ఉటంకించి, నా దారిన నేను వచ్చేశాను. తర్వాత పార్వతీ సౌందర్యప్రలోభుడై జలంధరుడు మన్మధ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా! అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన ''రాహు''వనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలు అన్నీ తన కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురుపెట్టాడు. ''ఏం పనిమీద వచ్చావు?'' అన్నట్లు కనుబొమల కదలికతోనే శివుడు ప్రశ్నించాడు .

రాహువు చెప్పసాగాడు...

''ఓ కైలాసవాసా! ఆకాశంలోని దేవతలచేత, పాతాళంలోని ఫణులచేత కూడా సేవింపబడుతున్నవాడూ, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మారాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. 'హే వృషధ్వజా! వల్లకాటిలో నివసించేవాడిని, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుని కూతురు, అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్నిరకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను. కనుక స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గానీ, నువ్వు ఎంతమాత్రంతగవు''

 కీర్తిముఖోపాఖ్యానం

రాహువు అలా చెబుతుండగానే, ఈశ్వరుని కనుబొమల వల్ల రౌద్రాకారుడు అయిన పురుషుడు వేగవంతం అయిన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదికి లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు. కానీ, ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకుని మింగబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకుని, శివాభిముఖుడై ''హే జగన్నాథా! నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ. వీనిని తినవద్దు అంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతి ఇవ్వు'' అని కోరాడు.

హరుడు అతన్ని చూసి, ''నీ మాంసాన్నే నువ్వు ఆరగించు'' అన్నాడు.

శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తిన్నాడు.

శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహా పురుషుని పట్ల కృపాళుడైన కంఠకాలుడు ''నీ ఈ భయంకర క్రుత్యానికి సంతుష్టుడిని అయ్యాను. ఇకనుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు'' అని ఆశీర్వదించాడు.

ఓ పృథురాజా! తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు.. అంతేకాదు, ''ఇకమీదట, ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించినవారి పూజలు వృథా అవుతాయి. కనుక నన్ను అర్చించదలచినవారు ముందుగా కీర్తిముఖుని పూజించితీరాలి'' అని ఈశ్వరుడు శాసించాడు. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడంవల్ల తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెండాడు. ఆ మీదట రాహువు తనకు అది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా పొల్లు పోకుండా చెప్పాడు.

Karthika Puranam Epic and spiritual bath, Karthika Puranam and light diya, Karthika Puranam and Karthika Vratam, Rituals of Hindu Epic Karthika Puranam


More Festivals