సంపూర్ణ కార్తీక మహాపురాణము

పదమూడవరోజు పారాయణము

 

 

సప్తవింశాధ్యాయము 

విష్ణోవాచః 'దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై వుండగా, విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు యెంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనమును చేయాలి. కాని, బ్రాహ్మణుని మాత్రం దండించగూడదు.


శ్లో|| బ్రాహ్మణో బ్రాహ్మణై రేవ నిగ్రాహ్యో వేదవాదిభిః
సత్య ధర్మాది నిరతైః లోభ దంభ వివర్జితైః ||

 

Sampoorna Karthika Maha Purananamu 13th Day Parayanam

 


దోషియైన బ్రాహ్మణుని - వేదవిదులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులూ అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమునుచేసి, ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు - ధనహరణము లేదా వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించగూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, యితరులచే తాను చంపించినా, కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు - బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై వున్నాడు. కాబట్టి నువ్వు తత్ క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది' అని విష్ణువు చెప్పగానే, దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసునిని, అతనిమీదికి రానున్న సుదర్శనాన్నీ చూడగానే, అంబరీషుడు - ఆ చక్రానికికేదురేళ్ళి - 'ఓ సుదర్శన చక్రమా! నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందునా బ్రాహ్మణుని ఇలా క్రూరంగాహింసించడం న్యాయం గాదు' అంటూనే ధనుర్ధారియై, ఇంకా ఇలా చెప్పసాగాడు.

సప్తవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది ఏడు అధ్యాయము) 

       

అష్టవింశాధ్యాయము

 

Sampoorna Karthika Maha Purananamu 13th Day Parayanam

 



'ఆగు! ఓ విష్ణుచక్రమా, ఈ బ్రాహ్మణవధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధనికైనా సరే నేను సిద్ధముగానే వున్నాను. రాజులకి యుద్ధమే ధర్మముగాని, యాచన చేయడం ధర్మము కాదు. విష్ణ్వాయుథానివైన నీవు నాకు దైవస్వరూపానివే. గనుక నిన్ను ప్రార్ధించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్ధం నేను నిన్ను యేదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియును. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరికొన్నాళ్లపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి వుండదలచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్లిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను. అని క్షాత్రధర్మపాలనకై, తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్ధారియై నిలబడిన అంబరీషుణ్ని ఆప్యాయంగా చూసి, అతని ధర్మనిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. 'అంబారీషా! నాతో యుద్దమంటే సంబరమనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటభుల్నీ - దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్నీ అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా, సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తియైన ఈ దూర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే - అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతూండగా, కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం చెయ్యగలవు? క్షేమం కోరుకునే వాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగాని, ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి, వృథాగా ప్రాణాలను పోగొట్టుకోకు.' ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి.

 

Sampoorna Karthika Maha Purananamu 13th Day Parayanam

 

ఏమిటి సుదర్శనా? ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నానుగాని, లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి వుండే వాణ్ని. దేవబ్రాహ్మణులైనా, స్త్రీలూ - శిశువుల మీదా, ఆవుల మీదా నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష - ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్షాత్ర) ధర్మయుతంగా పురుషరూపుడివై యుద్ధము చెయ్యి' అంటూ - ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికీ, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికీ సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసమును చేస్తూ - 'రాజా! శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని, విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుణ్ని వదిలేస్తున్నా'నని చెప్పి, అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై - 'సుదర్శనా! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ, విష్ణుతుల్య ప్రకాశమానమూ ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు' అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు.   సంతసించిన సుదర్శనుడు, అంబరీషుని లేవనెత్తి అభినందించి, దీవించి, అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా - అనేక భోగాలను అనుభవించి - అంత్యాన ఉత్తమగతులను పొందుతారు.

ఏవం శ్రీస్కాందపురాణంతర్గత కార్తీక మహాత్మ్యేఅష్టానింశాదయ్యము:' సమాప్త:


(ఇరువది ఏడు - ఇరువది ఎనిమిది అధ్యాయములు)

 

Sampoorna Karthika Maha Purananamu 13th Day Parayanam

 

 

13 వ రోజు

నిషిద్ధములు :- రాత్రి భోజనం, ఉసిరి

దానములు :- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము  :- మన్మధుడు

జపించాల్సిన మంత్రము  :- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం  


పదమూడవ (త్రయోదశి దిన) రోజు పారాయణము సమాప్తము


More Kartika Maha Puranam