కార్తీక మహా పురాణం ఇరవైయ్యవ రోజు

శివుని మూడో కంటి నుండి పుట్టిన బాలకుడు

Karthika Puranam – 20

నారద, పృథు చక్రవర్తుల సంభాషణ

''దేవర్షీ! తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియ, విష్ణువల్లభ' తదితర పేర్లతో సంబోధించావు. విష్ణుమూర్తికి అంత ప్రియమైన తులసి మహత్యాన్ని వివరంగా చెప్పు'' అనడిగాడు, నారదుని పృథుమహర్షి.

నారదుడు చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు.

''శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతా, అప్సరసా సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపిఅయి ఉన్నాడు. భీత మహా దంష్ట్ర, రుద్ర నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ''ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?'' అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు.

ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వని కారణంగా ''నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను'' అంటూ తన వజ్రాయుధంతో అతని మెడపై కొట్టాడు. ఆ దెబ్బకు భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా మారింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడిచేత అతనికి మొక్కింది. తాను ఇలా శాంతి స్తోత్రం చేశాడు.

బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం  

నమో దేవాది దేవాయ త్ర్యంబకాయ కపర్దినే 

త్రిపురఘ్నాయ శర్వాయ నమోంధ కనిఘాయిన

విరూపాయాది రూపాయ బ్రహ్మ రూపాయ శంభవే 

యజ్ఞ విధ్వంస కర్త్రేవై యజ్ఞానాం ఫలదాయినే 

కాలంత కాలకాలాయ కాలభోగి ధరాయచ

నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః

బృహస్పతి ఇలా ప్రార్ధించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశనమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించుకునేందుకు నిశ్చయించి ''బృహస్పతీ! నా కోపాగ్ని నుండి ఇంద్రుని రక్షించినందుకుగానూ ఇకనుంచి నువ్వు ''జీవ'' అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఎదైనా వరం కోరుకో'' అన్నాడు.

ఆ మాటమీద బృహస్పతి ''హే శివా! నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేశుని, త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి కాపాడు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపచేయి. ఇదే నా కోరిక'' అన్నాడు.

అందుకు సంతోషించిన సాంబశివుడు ''వాచస్పతీ! నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్ధన మన్నించి, అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు

గానూ సముద్రంలో పడేస్తున్నాను'' అన్నాడు. చెప్పినట్లుగానే చేశాడు శివుడు.

ఆ అగ్ని గంగా సాగర సంగమంలో పడి, బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ శోక ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం దద్దరిల్లింది. ఆ రోదన విన్న బ్రహ్మ పరుగున సముద్రుని వద్దకు వచ్చి, ''ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు?'' అనడిగాడు. సముద్రుడు నమస్కరించి, ''గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే. దయచేసి, వీనికి జాత కర్మాది సంస్కారాలు చెయ్యి'' అన్నాడు. ఈ లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది. అందువల్ల విధాత ''ఓ సముద్రుడా! నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడి పేర విఖ్యాతుడౌతాడు. సకల విద్యావేత్త, వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడు అవుతాడు'' అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరునికి కాలనేమి కూతురు బృందతో పెళ్ళి చేశారు. రూప, వయో, బల విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి, దానవాచార్యుడైన శుక్రుని సాయంతో సముద్రంనుండి భూమిని ఆక్రమించి స్వర్గంళా పాలించసాగాడు.

నారదుడు ఇంకా చెప్తున్నాడు...

''పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాల్లో దాగిన దానవబలమంతా ఇప్పుడు జలంధరుని ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకరోజు శిరోవిహీనుడైన రాహువును చూసి ''వీనికి తల లేదేమిటి'' అని అడగ్గా, శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మధనం అమృతపు పంపకం.. ఆ సందర్భంగా విష్ణువు అతని తల నరకడం - ఇత్యాది కథ చెప్పాడు.

అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడి, తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు. ఘస్మరుడు అనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి ''నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్రా! నా తండ్రి సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నిటినీ వెంటనే నాకు అప్పగించు'' అన్నాడు.

అది విన్న అమరేంద్రుడు ''ఓ రాక్షసదూతా! గతంలో నాకు భయపడిన లోక కంటకాలు అయిన పర్వతాలను, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మధనం చేయాల్సివచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రునిచేత వధింపబడ్డాడు. కనుక సముద్ర మధన కారణాన్నీ దైవతగణ తిరుస్కృతికి లభించబోయ ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో'' అని చెప్పాడు.

ఘస్మరుడు జలంధరుని దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలు వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు.

శుంభ-నిశుంభాడి సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాలవారు ముసల పరిఘ బాణ గదాది ఆయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాది శవాలతో , రక్త ప్రవాహంతో, రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ ''మృత సంజీవనీ'' విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవ గురువైన బృహస్పతి అచేతనాలైన దేవ గణాలను ద్రోణగిరిమీది దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు.

ఇది గ్రహించిన శుక్రాచార్యుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పార వేయించాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమయిందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ''ఓ దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కనుక మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి'' అని హెచ్చరించాడు.

అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాళాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై, శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు.

Karthika Masam non-vegetarian food brahma hatya, Karthika Puranam Vratam, Karthika Puranam Vratam in Karthika Masam, Rituals and customs of Karthika Puranam


More Festivals