ఇక్కడి స్వామి పేరు ‘బైరాగి వేంకటేశ్వరుడు’

 


కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆలయం అంటే తిరుపతే గుర్తుకువస్తుంది. ఇక్కడ సకల భోగాలూ అనుభవించే వేంకటేశ్వరుని బైరాగిగా ఊహించుకోగలమా! కానీ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో శ్రీనివాసుడు అలాగే కనిపిస్తారట. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? అక్కడి స్వామి ప్రత్యేకత ఏంటి?

 

కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది. రెండువేల అడుగులకు పైనే ఎత్తు ఉండే ఈ కొండ మీద ఉన్న ఆలయం గురించే మనం చెప్పుకొంటున్నది. ఈ కొండని ‘కరిఘట్ట’ అని పిలుస్తారు. కరి అంటే నలుపు అన్న అర్థం ఉంది కాబట్టి నల్లటి కొండ అన్న ఊహతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు. కరి అంటే ఏనుగు అన్న అర్థం కూడా ఉంది కదా! ఈ కొండ మీద ఏనుగులు తినే గడ్డి బాగా ఎదిగి కనిపిస్తుంది. అందుకనే ఏనుగుకొండ అన్న ఆలోచనతోనూ ఆ పేరు పెట్టి ఉండవచ్చు.

 

కరిఘట్ట మీద ఉన్న ఆలయం ఈనాటిది కాదు. వరాహపురాణంలో సైతం దీని ప్రస్తావన ఉంది. ఇక్కడి కొండ మీద కనిపించే దర్భలు సాక్షాత్తు ఆ వరాహస్వామి శరీరం నుంచి ఉద్భవించాయని అందులో పేర్కొన్నారు. అప్పట్లో ఈ కొండను నీలాచలం అని పిలిచేవారట. మన తిరుపతిలో కనిపించే ఏడుకొండలలో ఒకటైన నీలాద్రిలోని కొంతభాగమే ఈ నీలాచలం అని అంటారు. 

 

 

ఇక్కడి మూలవిరాట్టుని వైకుంఠ శ్రీనివాసుడు లేదా కరిగిరివాసుడు అని పిలుస్తారు. ఆరడుగుల నల్లని రాతిలో కనిపించే ఈ మూలవిరాట్టుని సాక్షాత్తు ఆ భృగు మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. ఈ స్వామికి అలంకారం చేసినప్పుడు, బైరాగిలా అగుపిస్తాడట. అందుకనే ‘బైరాగి వెంకటరమణుడు’ అని కూడా పిలుచుకుంటారు. పేరుకి బైరాగే కానీ ఈ స్వామిని కొలిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల నమ్మకం. జీవితంలో ఓర్చుకోలేని బాధలు వచ్చినప్పుడు, ఇక్కడ పూజలు నిర్వహిస్తే తప్పక ఫలితం దక్కుతుందట.

 

కరిఘట్ట ఆలయానికి చేరుకునేందుకు 400కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలా ఎక్కలేనివారు వాహనాల్లో చేరుకునేందుకూ రహదారి ఉంది. కొండ పక్కనే కావేరి ఉపనది అయిన లోకపావని ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండ మీదకు ఎక్కినవారికి కరిగిరివాసుని దర్శనం ఎలాగూ దక్కుతుంది. దానికి తోడుగా లోకపావనికి ఆవలి ఒడ్డున ఉండే నిమిషాంబ ఆలయం, శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి ఆలయాలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటు మైసూరు, శ్రీరంగపట్నం, చాముండి హిల్స్ కూడా కనువిందుచేస్తాయి.

 

మైసురు నుంచి శ్రీరంగపట్నానికి వెళ్లే యాత్రికులు తప్పకుండా ఈ కరిఘట్ట ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. చింత, ఉసిరి, కొబ్బరిచెట్లతో ఆహ్లాదకరమైన ఆ కొండ ప్రదేశంలో కాసేపు సేదితీరుతారు. ఆ ప్రకృతికి తోడు, దాన్ని పాలించే వేంకటేశ్వరుని దర్శనభాగ్యం ఎలాగూ ఉంటుంది. ఆయన రూపుని గుండెల నిండా నింపుకొని, తన కష్టాలు బాపమని వేడుకొని కరిఘట్ట ఆలయం నుంచి తిరుగుప్రయాణం అవుతారు.

- నిర్జర.
 


More Venkateswara Swamy