శివకేశవుల పండుగ... ఆనందాలు నిండుగ... హోళీ!

మన పండుగలలో ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేకత. ఒక పండుగ వ్యవసాయపనులకు సంబంధంగా ఉంటే, మరో పండుగ రుతువులకు సంబంధించినదిగా ఉంటుంది. ప్రకృతిని కొలుచుకునే పండుగ ఒకటైతే, అన్నాచెల్లెల్లు కలిసి జరుపుకునే పండుగ ఒకటి. అలాగే హోళీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది సామాజికమైన పండుగ! ఇందులో పిండివంటలు చేసుకున్నామా, దేవతలను పూజించామా అన్నది ముఖ్యం కాదు. గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకుని, ఇరుగుపొరుగుతో సంతోషాలను పంచుకునే పండుగ. హోళీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం మూడు...

తెలుగునాట హోళీని కామదహనం అనీ, కాముడి పున్నమి అని పిలవడం కద్దు. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను రుషులను, సత్పురుషులను, దేవతలను, ప్రజలను.... వాళ్లూ వీళ్లూ అని లేకుండా రాక్షసులు కాని వారందరినీ పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుడు అమిత బలవంతుడు. పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది. ఇంకేం! తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు. కనీసం కళ్లు కూడా తెరవని సమాధిస్థితిలో ఉన్నాడు. మరి శివ సతి అయిన పార్వతి మీద అతనిలో మోహాన్ని పలికించడం ఎలా. అందుకు స్వయంగా మన్మథుడే (కాముడు) పూనుకొన్నాడు. ఒక వసంతకాలాన, శివుడు యోగనిద్రలో ఉన్న వనాన... పార్వతీదేవి పూలు కోసుకుంటుండగా, కాముడు ఆయనను కమ్ముకున్నాడు. కళ్లు తెరిచి చూసిన శివుడు పార్వతిని చూసి ఎంతగా మోహించాడో, తన తపస్సుని భంగపరచిన మన్మథుని మీద అంతే కోపగించాడు. పట్టలేని కోపంతో శివుడు, తన మూడో కంటిని తెరవగా మన్మథుడు భస్మమైపోయాడు. ఆ ఇతివృత్తాన్ని గుర్తుచేసుకుంటూ, కామదహనం పేరుతో ఈ పండుగనాడు మంటలు వేసుకుంటారు.

    ఇక ఈ కామదహనాన్ని హోళికా దహనం అని కూడా పిలవడం కద్దు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుల కథ అందరికీ తెలిసిందే! నేలమీద కానీ నింగిలోకానీ; ఇంటగానీ బయటగానీ; రాత్రిగానీ పగలుకానీ; మనిషిచేతకానీ పశువుచేతకానీ; ఆయుధాలతోగానీ తనకు మరణం రాకూడదని హిరణ్యకశిపుడనే రాక్షసునికి ఉన్న వరం. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషికాగా, అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమభక్తుడు. ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాల మార్చాలని ప్రయత్నించిన హిరణ్యకశిపుడు, అన్నివిధాలా విఫలమై చివరికి ఉక్రోషంతో అతనికి మరణదండనను విధించాడు.

హిరణ్యకశిపునికి హోళిక అనే చెల్లెలు ఉండేది. ఆమెను అగ్ని దహింపజాలదని ఓ వరం ఉంది. హోళిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్లో కూర్చోపెట్టుకున్నట్లు నటించగానే, వారిద్దరికీ మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు. కానీ ఇతరులకు హాని తలపెడితే, హోళికకు ఉన్న వరం పనిచేయదనే విషయాన్ని మరచిపోయారు. అందునా పరమవిష్ణుభక్తుడైన ప్రహ్లాదుని దహించడం ఎవరితరం! కాబట్టి హోళిక వరం బెడిసికొట్టి, ఆమే అగ్నికి ఆహుతైపోయింది. సరే తరువాత రోజుల్లో విష్ణుమూర్తి, నరసింహావతారాన్ని ఎత్తి, హిరణ్యకశిపుని సంహరించాడనుకోండి! హోళికా దహనం పేరట జరుపుకొనే ఆ పండుగే హోళీ!


    
    ఇక రాధాకృష్ణుల సంబంధంగా చెప్పుకొనే హోళీ కథ చాలా సరదాగా ఉంటుంది. కృష్ణుడు నల్లనివాడు కదా! తన చిన్నప్పుడు పూతన పాలు తాగడం వల్ల, కృష్ణుని మేని నీలమేఘపు రంగులోకి మారిపోయిందంటారు. మరి రాధేమో కృష్ణునికంటే కాస్త చాయగా ఉండేది. ఈ విషయమై కృష్ణునికి కాస్త ఈర్ష్యగా ఉండేదట. ఓసారి తన తల్లి యశోద చెంతకు చేరి తన మనసులో విషయం చెప్పాడట కన్నయ్య. దాంతో యశోద ‘మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు, హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి’ అని సలహా ఇచ్చిందట. యశోద అలా చెప్పడం ఆలస్యం, చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు. యశోదతో పాటుగా గోపికలదంరినీ రంగు నీళ్లలో ముంచెత్తాడు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా జరుపుతారు. హోళీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తరభారతదేశంలో చూడవచ్చు. హోళీ తరువాత వచ్చే పంచమినాటి వరకూ కూడా ఈ సంబరాలు సాగుతాయి.

 

 కారణాలు ఏవైనా... రంగులతోనూ, మంటలతోనూ జరుపుకొనే ఈ రోజు మన ముఖ్య పండుగలలో ఒకటిగా నిలిచిపోతుంది. బాన్‌ఫైర్ (Bonfire) పేరుతో మంటలు వేసి, ఆ మంటల చుట్టూ నలుగురూ కలిసి ఆడిపాడే సంప్రదాయం ప్రపంచమంతా ఉన్నదే! కానీ ఆ సంప్రదాయానికి భోగిపేరుతోనో, హోళీ పేరుతోనో ఓ అందమైన రూపాన్నిచ్చి... అనాదిగా ఓ పండుగలా కొనసాగిస్తున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతిదే! ఇక అరమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా, ఏ ఆధునిక ఉత్సవానికీ తీసిపోదు. మరి హోళీ అంటే ఇష్టపడనిది ఎవరు?


More Holi Purnima