ఆ ఆలయం నుంచే ముల్తానీ మట్టి వచ్చేది

 

 

హైందవమతంలో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మనం నిత్యం జపించుకునే గాయత్రి సైతం సూర్యుని స్తుతించే మంత్రమే అన్న వాదనలు లేకపోలేదు. అలాంటి సూర్యుని కొలుచుకునేందుకు వేల ఏళ్ల క్రితమే ఓ ఆలయాన్ని నిర్మించారు. అదే పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్యదేవాలయం! దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్లోని కశ్యపపురం అనే నగరంలో ఓ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ నగరానికంతటికీ ఆ సూర్యదేవాలయమే ముఖ్య ఆకర్షణగా ఉండేదట. ఆ ఆలయాన్ని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారట. అందుకే ఆ నగరాన్ని మూలస్థానం అని పిలుచుకోసాగారు. క్రమేపీ ఆ పేరు ‘ముల్తాన్’గా మారిపోయింది.

 

ముల్తాన్లోని సూర్యదేవాలయాన్ని కృష్ణుని కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. అనుకోకుండా ఒక పాపకార్యం చేసిన సాంబుడిని, కుష్టు వ్యాధితో బాధపడమని కృష్ణుడు శపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ మీదట ప్రజలంతా కూడా తమ రోగాలు, కష్టాల నుంచి విముక్తి పొందేందుకు ఈ ఆలయాన్ని దర్శించసాగారు. అక్కడి మట్టికి సైతం రోగాలను నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు. ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్లేవారు. అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది.

 

అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు, తలుపులు, స్తంభాలు, శిఖరాలు... అన్నీ కూడా వెండి, బంగారాలతో ధగధగలాడిపోతుండేవి. ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలు రాజ్యానికి ముఖ్య ఆదాయంగా ఉండేవి. ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలయినా కూడా ఆలయానికి ఏమాత్రం ఢోకా రాలేదు. క్రమేపీ ఆ పాలకుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఆ పోరులో ముల్తాను మీద పైచేయి సాధించినవారు తమ కసినంతా సూర్యదేవాలయం మీద చూపించారు. పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహమ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశాడు. ఇప్పుడైతే ఈ సూర్యదేవాలయం ఎక్కడుందో కూడా ఆనవాళ్లు లేవు.

 

ముల్తాన్లో సూర్యదేవాలయంతో పాటుగా మరో విశిష్టమైన దేవాలయం కూడా ఉండేది. అదే నరసింహస్వామి ఆలయం. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు పాలించిన రాజ్యం ఈ ప్రాంతమే అని భక్తుల నమ్మకం. అందుకనే ఈ ఊరికి హిరణ్యకశిపుని పేరు మీదుగా కశ్యపపురం అనే పేరు కూడా ఉంది. హిరణ్యకశిపుని వధ తర్వాత, స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామికి ఓ ఆలయాన్ని నిర్మించాడట. ఈ ఆలయాన్ని కూడా ఎప్పటికప్పుడు అల్లరిమూకలు ధ్వంసం చేస్తూ వచ్చాయి. అయినా కూడా స్థానిక హిందువులు ఆలయాన్ని పునర్నిర్మించుకునేవారు. 1992లో మన దేశంలో బాబ్రీ మసీదుని కూల్చివేసినందుకు నిరసనగా, ఈ ఆలయాన్ని దాదాపుగా నేలమట్టం చేసేశారు. ప్రస్తుతానికి ఆ ఆలయం తాలూకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి.

- నిర్జర.

 

 


More Purana Patralu - Mythological Stories