విద్యతోనే అన్నీ
విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం ।
పాత్రత్వాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్॥
విద్యతో వినయం చేకూరుతుంది. ఆ వినయంతో అర్హత (పాత్రత) లభిస్తుంది. పాత్రత వల్ల ఎలాగూ ధనం సమకూరుతుంది. ఆ ధనములోంచి కొంత దానం చేసి సుఖాన్ని పొందవచ్చు. ఇక్కడ కేవలం విద్య యొక్క ప్రాముఖ్యతని మాత్రమే వివరించలేదు. దానివలన వ్యక్తిత్వం బలపడుతుందనీ, మనిషి సామర్థ్యం మెరుగుపడుతుందనీ, భౌతికమైన సంపదనీ పొందగలుగుతామనీ, పదిమందికీ ఉపయోగపడేలా దానమూ చేయగలుగుతామని చెబుతున్నాడు కవి. అంటే ఇక్కడ సుఖం అనేది ఒక్క భౌతికంగానే కాదు సర్వతోముఖంగా ఉంది. విద్యతో ఇహమూ పరమూ సిద్ధిస్తాయని ఈ పద్యం చెబుతోంది.