ఈరోజే సంకటహర చతుర్థి ఈపని తప్పక చేయండి..

 

 

మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి!

పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.

ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.

కొంతమంది ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేస్తారు. దాని కోసం వినాయకుడి ముందు తెలుపు లేదా ఎర్రటి జాకెట్‌ గుడ్డని పరిచి, అందులో పసుపుకుంకుమలు వేయాలి. మనసులో ఉన్న కోరికను తల్చుకుని ఆ గుడ్డలో మూడు గుప్పిళ్లు బియ్యం పోయాలి. ఆపై రెండు ఖర్జారాలు, రెండు వక్కలు, దక్షిణ వేసి మూటకట్టాలి. ఈ ముడుపుని స్వామి ముందు ఉంచి టెంకాయ కొట్టి నైవేద్యం చేసి... సంకటహర చతుర్థి వ్రతకథని చదువుకోవాలి.

ఈ వ్రతాన్ని3,5,11, లేదా 21 నెలల పాటు చేయాలి. ఈ వ్రతాన్ని చివరగా చేసే రోజున ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా తీరిపోతుందంటున్నారు. ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ, వ్రతం చేయడం కానీ కుదరకపోయినా ఫర్వాలేదు. ఆ రోజు ఓ నాలుగుసార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లినా కూడా ఆ స్వామి ప్రసన్నం అవుతాడట.   https://www.youtube.com/watch?v=acKcb1hN_no

- nirjara


More Vinayakudu