చందనోత్సవం ఇలా జరుగుతుంది

 

 

ఏటా అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం ఘనంగా జరిగే విషయం తెలిసిందే! ఇందుకోసం భారీ కసరత్తే జరుగుతుంది. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్నే ఇందుకు వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలని నిర్వహించి, గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలుపెడతారు.

 

తెల్లవారితే అక్షయ తృతీయ అనగా, అర్థరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తరువాత అక్షయతృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది. స్వామివారిని తొలిగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే!

 

అక్షయతృతీయ రాత్రివేళ వరకూ భక్తుల దర్శనం సాగిన తరువాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి వెయ్యి కలశాలతో ‘సహస్ర ఘటాభిషేకాన్ని’ నిర్వహిస్తారు. ఆ తరువాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అటు మీదట మూడు మాణుగలు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు. ఆ చందనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు.

ఈ చందనపు పూత కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే క్రతువు కాదు. సంవత్సరానికి నాలుగు సార్లు మూడు మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటుగా వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు. అలా స్వామివారికి కప్పిన 12 మాణుగలు.... అంటే 500 కిలోల చందనాన్నీ, అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

- నిర్జర.

 

 


More Akshaya Tritiya