కర్ణుడు సరే... మరి వికర్ణుడు ఎవరు!

 


మహాభారతంలో ఉదాత్తమైన పాత్రల గురించి మాట్లాడుకోగానే కర్ణుడి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. కానీ వికర్ణుడి పేరు ఎప్పుడైనా విన్నారా? వింటే మీరే అంటారు... కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తత వికర్ణుడిది అని! వికర్ణుడు ఎవరో కాదు! నూరుగురు కౌరవులలో ఒక్కడు. కానీ అన్యాయం జరిగిన రోజున ఆ ఒక్కడే దుర్యోధనుని ఎదిరించి నిలబడ్డాడు. అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షం వహించాడా అంటే అదీ లేదు. సోదరుని బంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. ఆ వికర్ణుని కథా కమీమీషు...

 

వికర్ణుడు అందరు కౌరవులలాగానే హస్తినలో అల్లారుముద్దగా పెరిగాడు. సకల అస్త్ర విద్యలనూ ఔపోసన పట్టాడు. తన సోదరులతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్య వంటి అతిరథుల వద్ద  యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. బహుశా అలా నూరుగురిలో ఒక్కరిగా వికర్ణుని కథ సాగిపోయేదేమో! కానీ ద్రౌపదీ వస్త్రాపహరణం సమయానికి అతను వెలుగులో కనిపిస్తాడు. ఆ ఘట్టంలో... పాండవులను కపట జూదంలో ఓడించిన దుర్యోధనుడు అందుకు పణంగా ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ సందర్భంలో భీష్మ, ద్రోణ వంటి పెద్దలంతా తలవంచుకు ఉండిపోతే... వికర్ణుడు ఒక్కడే అలా చేయడం తప్పంటూ వారిస్తాడు. వారి చర్యల వల్ల కురువంశానికే మచ్చవస్తుందని హెచ్చరిస్తాడు. ఆ సమయంలో వికర్ణుడి నోరుమూయిస్తాడు కర్ణుడు.

 

మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని గడపడం; తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమంటూ కృష్ణుని ద్వారా దుర్యోధనునితో సాగించిన రాయబారం విఫలం కావడం... ఇవన్నీ కూడా కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసే విషయం తెలిసిందే! ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలిసినా, తాము ఓడిపోతామని ముందే గ్రహించినా... వికర్ణుడు తన అన్నను అనుసరించడానికే సిద్ధపడతాడు. అలాగని ఏదో తూతూమంత్రంగా యుద్ధం సాగించలేదు వికర్ణుడు. కురుక్షేత్ర సంగ్రామం నడిచిన ప్రతిరోజూ అతని ప్రతిభ మార్మోగుతూనే ఉండేది. వికర్ణుడు అద్భుతమైన విలుకాడు. విలువిద్యలో కర్ణుని తరువాత ఎన్నదగిన యోధుడు. అందుకే భగవద్గీత తొలి అధ్యాయమైన ‘అర్జున విషాదయోగం’లోని ఎనిమిదవ శ్లోకంలో వికర్ణుని ప్రస్తావన వస్తుంది. అందులో...

 

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ ।8।

 

అని ద్రోణాచార్యులతో అంటాడు దుర్యోధనుడు. ఇందులో ద్రోణాచార్యలు, భీష్ముడు, కర్ణడు, కృపాచార్యడు, అశ్వత్థామ వంటి యోధులంతా తన సరసన ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడటం కనిపిస్తుంది.

 

వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరవుల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజున వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు. వారిరువురి మధ్యా జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు. వికర్ణుని మృత్యువుకి భీముని మనసు సైతం భారమైపోయిందంటారు. అసలు ఒక కథనం ప్రకారమైతే భీముడు, వికర్ణునితో యుద్ధం చేసేందుకు ఇష్టపడడు. కానీ క్షాత్ర ధర్మం ప్రకారం పోరాడి తీరవలసిందే అంటూ అతడిని రెచ్చగోడతాడు వికర్ణుడు. అలా తుదివరకూ తను నమ్మిన ధర్మానికి కట్టుబడిన వీరుడు వికర్ణుడు. అందుకే ఇప్పుడిప్పుడే వికర్ణుని గురించిన గాథలు మళ్లీ ప్రచారంలోకి వస్తున్నాయి. గత ఏడాది చింతకింది శ్రీనివాసరావు అనే రచయిత వికర్ణుని గురించి తెలుగులో ఒక పుస్తకాన్ని సైతం తీసుకువచ్చారు.

 

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories