మీ తల్లి కొడుకులు వల్ల మా వంశ౦ మంటకలసిపోయాయి. ధుర్తురాలా! మీ ముఖం చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి” అంటూ ఆవేదన పడుతూనే ఆవేశంతో భార్యను నిలదీస్తాడు యజ్ఞదత్తుడు.
మాములు సమయంలో భర్తకు ఎప్పుడు ఎదురాడి ఎరగనిదా ఇల్లాలు . కొడుకు మీద ఉన్న ప్రేమతో గుడ్డిగా వ్యవహరించిందే తప్ప భర్తను మోసగిస్తున్నానని భావన ఆమెలో ఎప్పుడు కలుగలేదు.అలా కలిగి ఉంటే ఆనాడే కుమారుడిని మంచిదారిలో పెట్టేందుకు ప్రయత్నించేది. లేదా అతని గురించి భర్తతో చెప్పి ఉండేది .ఇప్పుడు తానెంత అవివేకంగా ప్రవర్తించి౦దో తెలిసివస్తో౦ది. భర్తను క్షమించమని అడుగుదామన్నా వినే ధోరణిలో లేదు యజ్ఞదత్తుడు .
ఇంకా కోపంతో “నీకు ముచ్చటపడి మెడకు చేయించిన ఆ ముత్యాలహారం ఏమైంది ? ఎప్పుడో చేయించిన కొత్తలో తప్ప , పండుగల వేళలో కూడా దాన్ని నీ మేడలో పెట్టుకోగా చూడలేదు . దాన్ని నువ్వు ,నీ కొడుకూ కలసి ఏ వ్యాపారి దుకాణంలో తాకట్టు పెట్టారు ? ఇంకా బంగారు వడ్డాణం,నగలు, ఇంటిలో ఉన్న వెండిచెంబులు ఏవి ఒక్కటీ కనిపి౦చవే ?అవన్ని ఏ కులట మేనిపై కులుకుతున్నాయో ? అంటూ నిలదీస్తుంటే ఏమి మాట్లాడకుండా అలానే బిక్కచచ్చిన ముఖంతో నిలబడి ఉంటుంది సోమిదమ్మ .
భర్త అడిగే వాటిలో ఏ ఒక్క వస్తువూ ఇప్పుడు ఇంటిలో లేదు. ఉన్నట్టు౦డి ఇవన్నిఈయనకెలా తెలిసాయో సోమిదమ్మకు అర్ధం కావడంలేదు . ఇప్పుడు గుణనిధి వస్తే ఈ కోపంలో వాడినేమి చేస్తారో అనుకుంటు ఈ సమయంలో కూడా కొడుకుని తలచుకొని కుమిలిపోతుందా వేర్రితల్లి . |